తెలంగాణలో కాంగ్రెస్ స్పీడ్ పెంచుతోంది.వరుస వరుసగా పార్టీ కీలక నాయకులంతా వివిధ పేర్లతో పాదయాత్రలు మొదలు పెడుతున్నారు.
జనాల చూపు కాంగ్రెస్ వైపు ఉండేలా చేసుకుంటున్నారు.బీఆర్ఎస్ ,బిజెపిల కంటే కాంగ్రెస్ మెరుగైన పాలన అందిస్తుందనే భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనైనా తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.ఈ మేరకు ఎప్పటికప్పుడు పార్టీ హై కమాండ్ కూడా దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది.
ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 31 ఎస్సీ , ఎస్టీ , రిజర్వడ్అసెంబ్లీ స్థానాలను దక్కించుకోవడంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.రిజర్వ్ స్థానాలు అన్నిటిని గెలుచుకోవాలనే లక్ష్యాన్ని విధించుకుంది.
ఈ మేరకు టిపిసిసి ప్రధాన కార్యదర్శిలను ఈ నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా బాధ్యతలు అప్పగించబోతోంది .వీరి నియామక ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుంది.దళిత , గిరిజన సమస్యలను వీరు గుర్తించే విధంగా పార్టీ క్యాడర్ కు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.‘ లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ ‘ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.అలాగే అసెంబ్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యేక కమిటీలను నియమించబోతున్నారు.
రాష్ట్ర కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డి ఉండబోతున్నారు.తెలంగాణ వ్యాప్తంగా 31 ఎస్సీ, ఎస్టీ రిజర్వడ్ అసెంబ్లీ నియోజకవర్గాలపై ఈ విధంగా ప్రత్యేక ఫోకస్ చేయడం ద్వారా, అన్ని స్థానాలను గెలుచుకోవచ్చని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.అలాగే సమన్వయకర్తల నియామకం , రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల స్థాయి కమిటీల ఏర్పాటు, స్థానిక సంస్థల గుర్తింపు, కేడర్ కు శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది.
ఇప్పటికే కాంగ్రెస్ కమిటీ నిన్న గాంధీభవంలో భేటీ అయింది.ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యరావు టాక్రే, ఏఐసీసీ నేత కొప్పుల రాజు, ఏఐసీసీ కార్యదర్సులు నదీమ్ ,జావేద్, రోహిత్ చౌదరి, ఆదివాసి కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బెల్లయ్య నాయక్ , టి పి సి సి ,ఎస్ సి ,ఎస్ టి, ఓ బి సి మైనార్టీ విభాగాల అధ్యక్షులు, ఓబీసీ జాతీయ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.ఎస్సీ ఎస్టీ రిజర్వడ్ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ఏం చేయాలని విషయం పైన ఈ సమావేశంలో చర్చించారు.