నల్లగొండ జిల్లా:ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు నల్లగొండ జిల్లాలోని జిల్లాలోని చిన్నా చితకా చెరువులు జలకళను సంతరించుకున్నాయి.కానీ,దామరచర్ల మండలం తిమ్మాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీ చెరువు పరిస్థితి భిన్నంగా ఉంది.
ఈ చెరువు పూడిక తీశారు.కానీ,నీటిని నింపడంలో నిర్లక్ష్యం చేశారు.
దీనితో చెరువు నీరులేక వెలవెల బోతూ నెర్రెలుబారి ఎదురు చూస్తుంది.ఇంతకీ ఈ చెరువులోకి నీరు నింపకపోవడానికి ఎస్సీ కాలనీ చెరువు అని దీనికి పేరు ఉండడమే కారణమని తెలుస్తోంది.
దీనితో ఆ చెరువు ఇలా అంటుంది.నేను పేరుకే ఎస్సీ కాలనీ చెరువును.
కానీ,అందరికీ ఉపయోగపడే కల్పతరువును.
ఎస్సీ అయితే మనుషుల పట్ల వివక్ష చూపే దౌర్భాగ్యులు ఉన్న సమాజంలో ఎస్సీ కాలనీ చెరువు అని ఉన్నందుకు నాపై వివక్ష చూపడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తుంది.
అందుకే నన్ను ఏ ప్రజాప్రతినిధి,అధికారి కూడా పట్టించుకోవడం లేదా అని ప్రశ్నిస్తుంది.నా ఆయకట్టు కింద దాదాపు 150 నుంచి 200 ఎకరాలు సాగు భూమి ఉంది.
అంతేకాకుండా నన్ను నీటితో నింపితే గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లు అనుకున్న స్థాయిలో పోయడానికి అనుకూలంగా ఉంటాను.అలాగే పశు పక్ష్యాదులకు, గ్రామ వ్యవసాయదారులకు ఆసరాగా ఉంటాను.
నన్ను సంబంధిత అధికారులు పట్టించుకోకుండా గ్రామ ప్రజల అవసరాలు తీర్చకుండా వదిలి వేయడం అంటే నీరు లేదు కాబట్టి చెరువుకు పనికిరాదని నన్ను కబ్జా చేసేందుకే ప్రయత్నాలు చేస్తున్నారా అని అనుమానం వ్యక్తం చేస్తుంది.
నన్ను ఇలాగే నిర్లక్ష్యం చేస్తే వచ్చే వేసవిలో ఉమ్మడి తిమ్మాపురం గ్రామపంచాయతీ పరిధిలోని పడమటితండా,తూర్పు తండా,బీసీ కాలనీ,ఎస్సీ కాలనీ వాసులకు తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్నది.
ఈ ఉమ్మడి గ్రామపంచాయతీలో దాదాపుగా 1500 పశువులు నీరు లేక అక్కడే ప్రమాదం ఉంది.ఇప్పటికైనా స్థానిక ప్రజా ప్రతినిధులు,సంబధిత అధికారులు నాపై వివక్షను పక్కన పెట్టి తక్షణమే నన్ను నీటితో నింపి ఈ పరిసర గ్రామ ప్రజల దాహార్తిని తీర్చే కల్పతరువుగా నన్ను మార్చవలసిందిగా వేడుకుంటుంది.