వరంగల్ జిల్లాలో వరద ఉధృతి పెరుగుతూనే ఉంది.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వరదలు పెరిగి ప్రజలకు వణుకు పుట్టిస్తోంది.
వరద ప్రవాహం వేగం అవడంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి.రామప్ప చెరువు నిండిపోయి ప్రమాదకర స్థాయికి చేరింది.
రామప్ప, మేడివాగుల్లో వరద నీరు చేరడంతో ఏటూరు నాగారం, ములుగు జిల్లాల మధ్య రాకపోకలు స్తంభించాయి.వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలోని కోనారెడ్డి చెరువు కూలిపోవడంతో ఖమ్మం, వరంగల్ ప్రధాన రహదారిపై ప్రవహించిన వరదనీటితో రోడ్డు కొట్టుకుపోయింది.
రాకపోకలు సాగించడానికి అవకాశాల్లేకుండా పోయింది.
పెరిగిన వరద నీటితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముంపు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి.ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి ప్రవాహం పెరిగింది.
దీంతో రామప్ప చెరువుకు వరద పోటెత్తడంతో నీటి మట్టం 40 అడుగులకు పెరిగింది.మరో 2 అడుగులకు నీటి మట్టం పెరిగితే ప్రమాదం పొంచి ఉందని అధికారులు చెప్తున్నారు.
ఈ మేరకు ముంపు ప్రాంతాలైన 20 గ్రామాలను తరలించేందుకు సంసిద్ధమయ్యారు.ఇప్పటికే నదికి దగ్గర్లో ఉన్న ముంపు ప్రాంతాలను గుర్తించి ఖాళీ చేయిస్తున్నారు.రామప్ప చెరువు నీటి మట్టం 2.91 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉందని, ఇప్పటికే ఇందులో 4.27 టీఎంసీలకు వరద నీరు చేరిందన్నారు.ఇంకో 2 అడుగులకు వరద నీరు చేరితే పెను ప్రమాదం సంభవిస్తుందన్నారు.