ఏపీ ప్రభుత్వంతో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వార్ నడుస్తోంది.రఘురామను ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేసేలా వైసీపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
అయితే ఇటీవల ప్రధాని పర్యటనకు ఓ ప్లాన్ ప్రకారం వైసీపీ ఆయన్ను దూరంగా ఉంచగలిగిందనే టాక్ వినిపిస్తోంది.మరోవైపు రఘురామ ఇంటి దగ్గర గుర్తు తెలియని వ్యక్తి సంచరించడంతో అతడిని ఎంపీ అనుచరులు, సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని చితకబాదారు.
తర్వాత తేలిందంటంటే అతడు ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ సిబ్బంది అని.ఈ నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ను రఘురామ అనుచరులు కిడ్నాప్ చేశారని హైదరాబాద్ పోలీసులకు ఏపీ అధికారులు ఫిర్యాదు చేశారు.
కానిస్టేబుల్ ఫరూక్ బాషా ఐడీ కార్డు లాక్కొని ఈడ్చుకుంటూ ఎంపీ ఇంటికి తీసుకెళ్లి ఎంపీ ఇంటిలో రెండు గంటలకు పైగా కానిస్టేబుల్ను రఘురామ అనుచరులు చిత్రహింసలకు గురిచేశారని ఏపీ అధికారులు పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఆరోపించారు.అయితే తమ ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుంటే గుర్తుతెలియని వ్యక్తిగా భావించి తమ అనుచరులు ప్రశ్నించారని ఎంపీ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే తాను ప్రధాని పర్యటనలో భాగంగా డ్యూటీకి వచ్చానని.ఎంపీ ఇంటికి కిలో మీటర్ దూరంలో తాను విధులు నిర్వహిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ పోలీసులకు వివరించాడు.
ఎంపీ రఘురామ మాత్రం తనను హత్యచేయడానికి తన కుటుంబాన్ని హత్య చేయడానికి ఏపీ సీఐడీ పోలీసులు తన ఇంటి వద్ద రెక్కీ చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే సోషల్ మీడియాలో వెలుగుచూసిన వీడియోలన్నీ ఈ వ్యవహారంలో రఘురామదే తప్పు అన్నట్టు చూపుతున్నాయి.చుట్టూ ఉన్న జనం అందరూ చూస్తుండగానే ఎంపీకి సంబంధించిన కారులో కానిస్టేబుల్ ను ఎక్కించుకుని వెళ్లారని ఘటన జరిగిన సమయంలో మీడియా కూడా అక్కడే ఉందని ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు చెప్తున్నారు.ఫరూక్ బాషాను ఎత్తుకెళ్లిన సమయంలో రఘురామ ఇంట్లోనే ఉన్నారని ఏపీ పోలీసులు ఆరోపిస్తున్నారు.
చూస్తుంటే ఈ కేసులో రఘురామకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.ఈ కేసులో ఇప్పటికే ఎంపీ భద్రతా సిబ్బందిని, నోయిడా సీఆర్పీఎఫ్ కమాండెంట్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.