టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఇద్దరూ ఇద్దరే.రాజకీయ వ్యూహాలు రచించడం లో ఈ ఇద్దరు నేతలు బాగా ఆరితేరిన వారే.
చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్ కు రాజకీయ అనుభవం తక్కువ.అయినా సొంతంగా పార్టీని స్థాపించి ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడం , 175 స్థానాలకు 151 స్థానాలను సాధించి తిరుగులేని మెజారిటీ దక్కించుకోవడం వెనుక జగన్ రాజకీయ కష్టం అంతా ఇంతా కాదు.
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేశారు.పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు అన్నిటిని నెరవేర్చి ప్రజలకు అన్ని రకాలుగా లబ్ధి చేకూర్చారు. ఈ సంక్షేమ పథకాలే తమను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయనే నమ్మకంతో జగన్ ఉండగా, ఆ సంక్షేమ పథకాలలో అవినీతి అక్రమాలు జరిగాయని, ప్రజల్లో జగన్ పాలన పట్ల వ్యతిరేకత పెరిగిందని, ఆ వ్యతిరేకత తమను అధికారంలోకి తీసుకువస్తుందని చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు.ఆ ఆశలతోనే ఒకరి పార్టీపై మరొకరు విమర్శలు చేస్తూ, రాజకీయంగా మరింత వేడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే 2019 ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలో వైసిపికి అఖండ మెజారిటీ దక్కింది.అక్కడ ఉన్న 52 అసెంబ్లీ స్థానాలకు 49 స్థానాలను వైసిపి గెలుచుకోగలిగింది.
కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీకి 102 స్థానాలు దక్కాయి.
మళ్లీ అదే రాయలసీమ లో అదే తరహా ఫలితాలు వస్తాయని జగన్ నమ్మకంతో ఉండగా, ఈసారి రాయలసీమలో టిడిపి పట్టు పెంచుకోవాలని, కనీసం 20 నుంచి 25 స్థానాలు రాయలసీమలో దక్కించుకోవాలనే ప్లాన్ తో చంద్రబాబు ఉన్నారు.అందుకే కర్నూలు పర్యటనలో లాస్ట్ చాన్స్ అంటూ సెంటిమెంటును రగిలించే ప్రయత్నం చంద్రబాబు చేశారు.రాయలసీమలో పట్టు పెంచుకుంటే కోస్తా, ఉత్తరాంధ్రలో టిడిపికి ఎలాగూ ఆదరణ ఉంటుందని, కచ్చితంగా అధికారంలోకి వస్తామని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.
దీంతో చంద్రబాబు రాయలసీమ పర్యటనకు కౌంటర్ గావైసిపి కర్నూలులో మూడు రాజధానులకు అనుకూలంగా డిసెంబర్ 5వ తేదీన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది.దీంతో పాటు, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోనూ వైసిపి బలం మరింతగా పెంచాలని జగన్ భావిస్తున్నారు.
దీనిలో భాగంగానే మూడు రాజధానుల సెంటిమెంటును మరింత పెంచడంతోపాటు, ఆయా ప్రాంతాల్లో ప్రధాన సామాజిక వర్గాల్లో కీలకంగా ఉన్న ఇతర పార్టీలలోని నాయకులతో పాటు, ఆయా కులాల్లో మంచిపట్టున్న తటస్థ వ్యక్తులను వైసీపీలో చేర్చుకునేందుకు వ్యూహాన్ని సిద్ధం చేశారు.ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, కోస్తాంధ్ర జిల్లాలోని టిడిపిని దెబ్బ కొడితే టిడిపికి మళ్ళీ పరాభవం ఎదురవుతుంది అనే అంచనాలో జగన్ ఉన్నారు.
ఈ విధంగా రెండు పార్టీల అధినేతలు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ, 2024 ఎన్నికల్లో తమదే పైచేయి ఉండే విధంగా రెండు పార్టీల అధినేతలు వ్యూహాలు రచించే పనిలో నిమగ్నం అయ్యారు.
.