విశాఖ నగర అభివృద్ధి ధ్యేయంగా ప్రతి వార్డు ను అభివృద్ధి పరుస్తున్నట్లు నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు.నగరంలోని ఆమె 3 వ జోన్ 25 వ వార్డు పరిధిలోని గొల్లవీధి, సీతమ్మధార, గణేష్ నగర్, రాజేంద్రనగర్, రెళ్లివీధి, శాంతిపురం లలో రూ.132.40 లక్షల వ్యయంతో బిటి రోడ్లు, సిసి రోడ్లు, సీసీ కాలువలు రెండు భవనాల మరమ్మతులుకు ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, నెడ్ క్యాప్ చైర్మన్ కే కే రాజు, వార్డ్ కార్పొరేటర్ సారిపెల్లి గోవింద్ తో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ నగరం పై ఉన్న ప్రేమతో ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని, నగరానికి పర్యాటపరంగా భారీ ఎత్తున నిధులు కేటాయించడం జరిగిందని తద్వారా జిల్లా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.నేడు కార్పొరేషన్ నిధులతో మన వార్డులో రూ.132.4 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని, కార్పొరేటర్ వార్డులోని సమస్యలను మా దృష్టిలో తీసుకొచ్చారని ఇంకా వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసి ఉందని వాటికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసి వార్డ్ ని ఒక మోడల్ వార్డ్ గా అభివృద్ధి పరుస్తామని తెలిపారు.మన నగరంలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని మనతో పెనవేసుకున్న ప్లాస్టిక్ను మన నుండి దూరంగా ఉంచాలని, అందుకు కష్టమైనా కఠినంగా వ్యవహరించి ప్లాస్టిక్ ను విడనాడి ప్రత్యామ్నాయంగా గుడ్డ, నారా సంచులను వాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.







