జనసేన పార్టీ ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఎన్నికల నాటికి కచ్చితంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటుందనే సంకేతాలు వెలువడుతూనే ఉన్నాయి.దీనికి తగ్గట్లుగానే పవన్ సందర్భం వచ్చినప్పుడల్లా వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చేల్చడం తనకు ఇష్టం లేదని చెబుతూ పొత్తులకు తలుపులు తెరిచే ఉన్నాయి అనే సంకేతాలను ఇస్తున్నారు.
టిడిపి అధినేత చంద్రబాబు సైతం పదే పదే జనసేన తో పొత్తు అంశాన్ని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రస్తావిస్తున్నారు.దీంతో జనసేన ఖచ్చితంగా టిడిపి, బీజేపీతో కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందనే అభిప్రాయం జనాల్లోనూ వచ్చేసింది.
దీనిపైనే వైసిపి నాయకులు సెటైర్లు వేస్తున్నారు.
దమ్ముంటే పవన్ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ చేస్తున్నారు.
ఈ సవాల్ ను చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారో లేదో తెలియదు కానీ, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు మాత్రం దీనిని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తున్నారు. అందుకే ఇటీవల విజయవాడలో మెగా ఫ్యాన్స్ అందరూ సమావేశమయ్యారు.
అఖిలభారత చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవణం స్వామినాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మెగా ఫ్యామిలీ ఫాన్స్ అంతా ఏకతాటిపైకి వచ్చి పవన్ ను ముఖ్యమంత్రిని చేయాలని, జనసేన కోసం పని చేయాలని తీర్మానించారు.
వీరందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు తెరవెనుక నాగబాబు గట్టిగానే కష్టపడ్డారట.అంతేకాదు పవన్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే పొత్తు గురించి ఆలోచిస్తామని నాగబాబు ప్రకటించడం వెనుక భారీ వ్యూహమే ఉన్నట్టు కనిపిస్తోంది.ఎట్టిపరిస్థితుల్లోనూ పవన్ ను ముఖ్యమంత్రి చేయాలని మెగా ఫ్యాన్స్ అంతా అభిప్రాయపడుతున్నట్లు … వారి కలలను నిజం చేసేందుకు నాగబాబు ఇప్పుడు జనసేన ను ఒంటరిగా ఎన్నికల బరిలోకి తీసుకువెళ్లాలని చూస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.
అది సాధ్యమవ్వని పక్షంలో పవన్ ముఖ్యమంత్రి గా ప్రకటించి, ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లేలా పవన్ పైన ఒత్తిడి పెంచుతున్నట్లుగా ఈ వ్యవహారాలను బట్టి చూస్తే అర్థమవుతుంది.కానీ ఈ వ్యవహారంపై పవన్ స్పందించకపోవడం రాజకీయ వర్గాల్లోనూ గందరగోళం కలిగిస్తోంది.