2019 ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా టీడీపీకి ఎదురుగాలి వీచినా విశాఖ ప్రజలు మాత్రం ఆ పార్టీకి అండగా నిలబడ్డారు.విశాఖ నగరంలో ఉన్న నాలుగు అసెంబ్లీ స్థానాలనూ టీడీపీకే కట్టబెట్టారు.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి జంప్ అయ్యారు.జగన్ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు గడిచినా విశాఖలో టీడీపీకి ఆదరణ తగ్గలేదు.ఇటీవల కొత్త జిల్లాగా ఏర్పడిన తర్వాత కూడా విశాఖ టీడీపీకే స్ట్రాంగ్గా ఉన్నట్లు కనిపిస్తోంది.
2019 ఎన్నికల తర్వాత కూడా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ బలపడింది లేదు.సరైన నాయకత్వం లేకపోవడంతో ప్రతి ఎన్నికకు ఇక్కడ వైసీపీ అభ్యర్థిని మార్చుతోంది.అయితే ఈ నియోజకవర్గంలో వైసీపీకి వర్గపోరు కూడా గట్టిగానే ఉంది.ఇటీవల వైసీపీ అధినాయకత్వం పార్టీ ఇంఛార్జిని మార్చడంలో అగ్గి రాజుకుంది.గడప గడపకు కార్యక్రమం నేపథ్యంలో ఇప్పటిదాకా ఇంఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ స్థానంలో డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ను వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి నియమించారు.
దీంతో మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ అనుచరులు సమావేశమై అధినాయకత్వం తీరుపై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతే కాదు తమకు న్యాయం జరిగే వరకు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకూడదని కూడా నిర్ణయించారు.
పార్టీ ఇంఛార్జిని మార్చే విషయంలో తమకు కనీస సమాచారం ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు.ఇది తమకు చాలా అవమానకరమని.తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు.గడప గడపకు కార్యక్రమం ముందే ఇలా ఇంఛార్జిని మార్చడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
అయితే 2024 ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కొత్త అభ్యర్థిని రంగంలోకి దించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఎందుకంటే గత ఎన్నికల్లో మళ్ల విజయప్రసాద్ దారుణ ఓటమిని చవిచూశారు.అంతేకాకుండా ఆయనపై కొన్ని వ్యక్తిగత కేసులు కూడా ఉండటంతో వైసీపీ అధిష్టానం సీరియస్గా ఉందని.అందుకే ఇంఛార్జిని మార్చిందని ప్రచారంలో ఉంది.కాగా ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి గణబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.ఆయనకు గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉంది.
.