రాజకీయంగా తన సత్తా చాటుకునేందుకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గట్టిగానే కష్టపడుతున్నారు .గత కొంతకాలంగా ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడంతో పాటు, వైసిపి ప్రభుత్వం పై నిత్యం ఏదో ఒక విమర్శలతో వార్తల్లో ఉంటున్నారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా లోకేష్ రాజకీయంగా బలోపేతం అయ్యారు.పార్టీలోనూ పట్టు సాధించడంతోపాటు , చంద్రబాబు తర్వాత ఆ స్థాయి నాయకుడిగా ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్నారు.
ఇక 2024 ఎన్నికల్లో టిడిపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా లోకేష్ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉంటాయని ప్రచారం చాలా కాలం నుంచి జరుగుతున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ ముందస్తుకు వెళ్లే ఛాన్స్ లేదని , షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని టిడిపి భావిస్తోంది. లోకేష్ పాదయాత్ర చేపట్టి ఏపీ అంతటా పర్యటించి తన బలంతో పాటు, టిడిపి వైపు జనాలు చూపు ఉండేలా చేసుకోవాలని భావిస్తున్నారు .చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం 450 రోజులు పాటు పాదయాత్ర చేపట్టాలని లోకేష్ నిర్ణయించుకున్నారు.2023 జనవరిలో ప్రారంభం కాబోతున్న లోకేష్ పాదయాత్ర 2024 మార్చిలో ముగిసే విధంగా షెడ్యూల్ రూపొందించారు. కుప్పం నుంచి ఈ యాత్రను లోకేష్ ప్రారంభిస్తారు.
అయితే గతంలో వైసిపి అధినేతగా ఉన్న జగన్ పాదయాత్ర చేపట్టి రాష్ట్రమంతా పర్యటించి ఏ విధంగా అయితే జనాల్లో క్రేజ్ తెచ్చుకున్నారో అంతకంటే ఎక్కువ స్థాయిలో తన పాదయాత్రకు క్రేజీ వచ్చే విధంగా లోకేష్ ముందు నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు.

అందుకే తన పర్యటనలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.తన పాదయాత్ర సాగే నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యలను హైలెట్ చేసి, స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రస్తావించి విమర్శలు చేయడం ద్వారా అక్కడి ప్రజల్లోనూ ఆదరణ పొందవచ్చు అనే విధంగా లోకేష్ ప్లాన్ చేసుకుంటున్నారు.ఇదిలా ఉంటే గతంలో జగన్ చేపట్టిన పాదయాత్ర రికార్డును బ్రేక్ చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి జగన్ కంటే ఎక్కువగా పాదయాత్ర చేసి, తనకు ఆదరణ మరింత లభించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.