ముచ్చటగా మూడోసారి టీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారు.తమ ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎప్పటికప్పుడు పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు.
ఒకవైపు బీజేపీ కాంగ్రెస్ లను ఎదుర్కొంటూనే ప్రజల మద్దతు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.తెలంగాణలోనే కాకుండా జాతీయ రాజకీయాల్లోనూ కీలకం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుండగా , ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు మొదలు కావడం ఆ పార్టీ అగ్రనేతలకు సైతం ఆందోళన కలిగిస్తోంది .అది కూడా తెలంగాణలో పెద్దగా ప్రభావం లేదని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీలోకి ఈ వలసలు వెళుతుండటం ఆందోళన కలిగిస్తోంది.టిఆర్ఎస్ ను టార్గెట్ గా చేసుకుని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
టిఆర్ఎస్ అసంతృప్త నేతలను ఒక్కొక్కరుగా పార్టీలో చేర్చుకుంటూ టీఆర్ఎస్ కు సవాల్ విసురుతున్నారు.దీంతో టిఆర్ఎస్ లో అలజడి మొదలైంది.ఇదే రకమైన వలసలు ముందు ముందు కొనసాగితే టిఆర్ఎస్ కోలుకోని విధంగా దెబ్బతింటుందనే ఆలోచనతో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. పార్టీలోని అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఎవరెవరికి ఏ ఏ విషయాల్లో అసంతృప్తి ఉందో తెలుసుకొని పరిష్కరించేందుకు పార్టీ కీలక నేతలను కొంతమందిని రంగంలోకి దించారు.అలాగే నియోజకవర్గాల వారీగా అసంతృప్త నేతలను గుర్తించి వారితో చర్చించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు .ఇప్పటికే మంచిర్యాల జడ్పీ చైర్మన్ గా ఉన్న నల్లాల భాగ్యలక్ష్మి తో పాటు, ఆమె భర్త చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు.
అలాగే దివంగత పీజేఆర్ కుమార్తె , ఖైరతాబాద్ టిఆర్ఎస్ కార్పొరేటర్ విజయ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తో పాటు, కరకగూడెం జడ్పీటీసీ కాంతారావు తదితరులు కాంగ్రెస్ లో చేరారు.వీరే కాకుండా పెద్ద ఎత్తున సీనియర్ నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమవుతుండటంతో టిఆర్ఎస్ పెద్దలు టెన్షన్ పడుతున్నారట.
వలసలు ఇదే రకంగా కొనసాగితే టిఆర్ఎస్ బలహీనమైంది అనే సంకేతాలు జనాల్లోకి వెళ్తాయని, ఈ వలసలు మరింతగా ఊపందుకుంటాయనే భయంతోనే కేటీఆర్ ఇప్పుడు పూర్తిగా వలసల పైన దృష్టి సారించినట్లు సమాచారం.