సీజనల్ వ్యాధుల దృష్ట్యా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల పట్ల అప్రమత్తంగా వుంటూ, అన్ని జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి.
గౌతమ్ అన్నారు.శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో రెసిడెన్షియల్ పాఠశాలల్లో సీజనల్ వ్యాధుల నియంత్రణకై చర్యలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్యాధికారులు తమ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు సందర్శించి, లక్షణాలు ఉన్నవారిని గుర్తించి పరీక్షలు చేయాలని అన్నారు.పాజిటివ్ ఉన్నవారిని మెరుగైన చికిత్స అందించాలని అన్నారు.
జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్ కేంద్రంలో 57 రకాల పరీక్షలు నిర్వహిస్తారని, నమూనాలు సేకరించడానికి 5 వాహనాలు సిద్ధంగా వుంటాయని, జిల్లా నలుమూలల నుండి నమూనాలు సేకరించి, డాయాగ్నోస్టిక్ కేంద్రం తరలించి, ఫలితాన్ని మొబైల్ ద్వారా అందిస్తారని అన్నారు. ఆర్బిఎస్కె టీమ్ రెసిడెన్షియల్ విద్యాసంస్థలను విజిట్ చేసి పరీక్షల నిర్వహణ, వ్యాధుల నియంత్రణపై అవగాహన కల్పించాలని అన్నారు.
జిల్లా అధికారులు రెసిడెన్షియల్ పాఠశాలల్లో బస చేసి, సమస్యలు గుర్తించి, పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. ఫ్రై డే డ్రై ని ఖచ్చితంగా పాటించాలన్నారు.
నీరు నిల్వలేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.పారిశుద్ధ్యం పట్ల చర్యలు చేపట్టి, లోపల, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
కిచెన్ షెడ్లు, డైనింగ్ హాళ్లు, టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
ఎక్కడ ఒక్క కేసు పాజిటివ్ వచ్చిన అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి యాదయ్య, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా.మాలతి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కృష్ణా నాయక్, జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి సత్యనారాయణ, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహమూది, జిల్లా బిసి సంక్షేమ అధికారి జ్యోతి, గురుకులాల ఆర్సీవో లు తదితరులు పాల్గొన్నారు.