నల్లగొండ జిల్లా:కుల,మత బేధాలు లేకుండా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఎస్.సి.
వి.ఎన్ సేవా సంస్థ అధ్యక్షులు రాఖీ గౌడ్ హెచ్చరించారు.పోలీస్ శాఖలోని ఎస్ఐ,కానిస్టేబుల్ నియామకాలలో కటాఫ్ మార్కుల విషయంలో బీసీలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఎస్.సి.వి.ఎన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని బీసీ సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ,ఎస్టీలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్,ఓసీలకు 20 మార్కులు కట్ చేసి 80 మార్కులుగా ఉన్నదానిని 60 కి తెచ్చి వారికి న్యాయం చేశారని అన్నారు.మరి ముఖ్యమంత్రి బీసీల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు.
బీసీలను అణగదొక్కాలని చూస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీసీల వాటా ప్రకారం బీసీల హక్కుగా 50 మార్కులు కటాఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా బీసీల తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శంకర్,గౌతమ్,అఖిల్,శివ,ప్రవీణ్ మరియు బీసీ విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.