టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ బాలీవుడ్లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ‘మణికర్ణిక’ చిత్రం చేస్తున్న విషయం తెల్సిందే.అయితే ఆ చిత్రం పూర్తి కాకుండానే ‘ఎన్టీఆర్’ చిత్రంను నెత్తికి ఎత్తుకోవడంతో హీరోయిన్ కంగనా రనౌత్కు క్రిష్కు మద్య విభేదాలు నెలకొన్నాయి అంటూ ప్రచారం జరిగింది.
ఈ సమయంలోనే కంగనా రనౌత్ తీరు క్రిష్ను తీవ్రంగా బాధ పెట్టిందని, అందుకే ఆయన సినిమా నుండి తప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని ఇటీవలే కంగనా మాత్రం క్రిష్తో ఎలాంటి విభేదాలు లేవని, ఆయన తెలుగు చిత్రంతో బిజీగా ఉన్న కారణంగా మా చిత్రంపై దృష్టి పెట్టడం లేదని, ఆ చిత్రం పూర్తి అయితే మణికర్ణికను పట్టించుకుంటాడు అని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

ఈ సమయంలోనే ‘మణికర్ణిక’ చిత్రం క్లాప్ బోర్డ్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది.ఆ క్లాప్ బోర్డ్పై దర్శకుడి స్థానంలో కంగనా రనౌత్ అని ఉంది.దాంతో సినిమాకు దర్శకురాలిగా కంగనా రనౌత్ చేస్తుందని తేలిపోయింది.క్లాప్ బోర్డు క్లీయర్గా కనిపించడంతో వివాదం పెద్దది అయ్యింది.దర్శకుడు క్రిష్ను కంగనా బయటకు నెట్టివేసి ఈ ప్రాజెక్ట్ను ఓన్ చేసుకున్నట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.వరుసగా భారీ చిత్రాలను తెరకెక్కించిన క్రిష్కు ఇది నిజంగా చేదు అనుభవం అని చెప్పాలి.
ఇద్దరి వర్కింగ్ స్టైల్ పూర్తి విభిన్నంగా ఉంటుందని, అందుకే వీరిద్దరు ఒకే సినిమాకు పని చేయలేక పోయారు అంటూ బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు.
క్లాప్ బోర్డు బయట పడ్డా కూడా ఇంకా కంగనా రనౌత్ టీం సభ్యులు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
అసలు దర్శకుడితో కంగనాకు ఎలాంటి గొడవ లేదని, ఆమె ప్రస్తుతం చిత్రంకు సంబంధించిన చిన్న చిన్న ప్యాచ్ వర్క్లో నటిస్తున్నారు.ఆ సమయంలోనే దర్శకురాలి స్థానంలో ఆమె పేరు వేసి ఉంటారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి కంగనా రనౌత్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మరో వైపు దర్శకుడు క్రిష్ తెలుగులో బాలకృష్ణ ప్రధాన పాత్రలో ‘ఎన్టీఆర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఎన్టీఆర్ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రస్తుతం సినిమా చిత్రీకరణను హరికృష్ణ మరణంతో తాత్కాలికంగా నిలిపేయడం జరిగింది.
మళ్లీ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది.