తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి( Jaggareddy ) ఎప్పుడూ ఏదో ఒక అంశంపై వార్తల్లో ఉంటూ ఉంటారు.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని( Revanth Reddy ) నియమించినప్పటి నుంచి, జగ్గారెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే వస్తున్నారు.
అనేక విషయాలపై సొంత పార్టీ నేతల పైన బహిరంగ విమర్శలు చేయడంతో పాటు, చాలా కాలం పాటు గాంధీ భవన్ కు దూరంగా ఉండిపోయారు.తాజాగా మనసులో మాట పేరుతో జగ్గారెడ్డి తనలోని అసంతృప్తిని వెళ్ళగక్కారు.
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలతో పాటు, చాలా కాలంగా తనకు జరుగుతున్న అవమానాలు వంటి వాటిని జగ్గారెడ్డి మీడియాకు విడుదల చేశారు.

” ఒకప్పుడు నేను రోజు గాంధీభవన్( Gandhi Bhavan ) లో కూర్చుని అనేక సమస్యలు మర్చిపోయి ఆనందించేవాడిని.ఈరోజు అక్కడికి వచ్చి ప్రశాంతంగా కూర్చునే పరిస్థితి కరువైంది.ఐదు నెలల నుంచి రాజకీయంగా గాంధీ భవన్ కు రాలేని పరిస్థితి నెలకొంది.
ఇది చాలా బాధగా ఉంది ” అంటూ జగ్గారెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టారు.ఇటువంటి ఆవేదనలు ఎన్నో తన మనసులో మెదులుతూనే ఉన్నాయి.ఏం చెప్తే ఏమవుతుందో , చెప్పకపోతే ఏం జరుగుతుందో కానీ , ఒక చిన్న మాటను తప్పని పరిస్థితిలో మీడియా ద్వారా కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు తెలియజేస్తున్న అంటూ జగ్గారెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానం పైన జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.త్యాగాలు చేసిన రాహుల్ గాంధీ( Rahul Gandhi ) కుటుంబం అంటే తనకు చాలా ఇష్టమని , ఆ పిచ్చి తోనే కాంగ్రెస్ పార్టీలో ఇంకా కొనసాగుతున్నానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.ఇదిలా ఉంటే మనసులో మాట పేరుతో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ తో పాటు , తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది.
రాష్ట్ర నాయకుల వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉంటూ వస్తున్న జగ్గారెడ్డి అనేక సందర్భాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఆయన బీఆర్ఎస్ లో జగ్గారెడ్డి చేరుతున్నారు అనే ప్రచారం జరిగినా, దానిని జగ్గారెడ్డి ఖండించారు.
తాను పార్టీ మారడం లేదని, కాంగ్రెస్ లోనే ఉంటానంటూ చెప్పిన ఆయన ఇప్పుడు మనసులో మాట పేరుతో మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు.







