ఆస్ట్రేలియాలో విషాదం చోటు చేసుకుంది.రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్ధి దుర్మరణం పాలయ్యాడు.
వివరాల్లోకి వెళితే.మృతుడిని పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాకి చెందిన కునాల్ చోప్రాగా గుర్తించారు.
గత వారం విలియం హోవెల్ డ్రైవ్లో అతను ప్రయాణిస్తున్న హ్యుందాయ్ కారును కాంక్రీట్ పంపింగ్ ట్రక్కు ఢీకొట్టింది.ఈ ఘటనలో కునాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా నివేదించింది.
సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్ సర్వీస్ పారామెడిక్స్ ఘటనాస్థలికి చేరుకుని చోప్రాకు వైద్య సహాయం అందించారు.అయితే అప్పటికే అతను ప్రాణాలు విడిచాడు.కునాల్ చోప్రా మరణవార్తను పంజాబ్లోని అతని తల్లిదండ్రులకు తెలియజేశారు.కుమారుడు తిరిగిరాని లోకాలకు తరలిపోయాడని తెలుసుకున్న వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదిలావుండగా.రెండ్రోజుల క్రితం కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 ఏళ్ల భారత సంతతి బాలుడు దుర్మరణం పాలయ్యాడు.
తరెన్ సింగ్ లాల్ అనే బాలుడు తన టెస్లా కారుపై ఇంటికి వెళ్తుండగా బ్రిటీష్ కొలంబియా లాంగ్లీలోని ఫ్రేజర్ హైవే, 228వ స్ట్రీట్ జంక్షన్ సమీపంలో ఒక యుటిలిటీ పోల్ను ఢీకొట్టింది.సమాచారం అందుకున్న లాంగ్లీ రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.లాల్.సర్రేలోని తమనావిస్ సెకండరీ స్కూల్లో చదువుకుంటున్నాడు.ఈ ఘటనపై అతని తల్లి ఓమ్ని న్యూస్తో మాట్లాడుతూ.
ప్రమాదానికి ముందు తన కుమారుడితో మాట్లాడానని అంతలోనే ఈ దారుణం జరిగిందని కన్నీటి పర్యంతమైంది.ప్రతికూల వాతావరణ పరిస్ధితులే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.లాల్ కుటుంబానికి, ముఖ్యంగా అతని 12 ఏళ్ల సోదరికి మద్ధతుగా GoFundMe పేజీని ఏర్పాటు చేశారు.
క్రీడలలో అద్భుత ప్రతిభ చూపి, భవిష్యత్తులో పోలీస్ శాఖలో చేరాలని లాల్ కలలు కన్నాడని.కానీ ఇవన్నీ కల్లలే అయ్యాయాని అతని కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది.