అమెరికాకు పొరుగున వున్న కెనడాలోనూ భారతీయులు రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు.ఇప్పటికే జస్టిన్ ట్రూడో మంత్రి వర్గంలో మంత్రులుగా పలువురు స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే.
అలాగే చట్టసభ సభ్యులుగా, రాజకీయ పార్టీ నేతలుగానూ భారతీయులు రాణిస్తున్నారు.తాజాగా భారత సంతతికి చెందిన రంజ్ పిళ్లై యుకాన్ ప్రావిన్స్ ప్రీమియర్గా ఎన్నికయ్యారు.
తద్వారా కెనడాలోని ఏదైనా ప్రావిన్స్కు ప్రీమియర్గా ఎంపికైన రెండో భారత సంతతి వ్యక్తిగా రంజ్ పిళ్లై రికార్డుల్లోకెక్కారు.యుకాన్ లిబరల్ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన తర్వాత ఆయన ఆదివారం యుకాన్ కమీషనర్ ఏంజెలిక్ బెర్నార్డ్ను కలిశారు.
అనంతరం యుకాన్ ప్రావిన్స్కు 10వ ప్రీమియర్గా పనిచేయాలనే తన ఉద్దేశ్యాన్ని పంచుకున్నారు.వారం రోజుల్లో రంజ్ పిళ్లై ప్రీమియర్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కేరళ మూలాలున్న రంజ్ పిళ్లై.కెనడాలోని నోవాస్కోటియా ప్రావిన్స్లో జన్మించారు.అయితే యుకాన్లో చాలాకాలం క్రితమే స్థిరపడ్డారు.విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణించిన ఆయన.అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి నవంబర్ 2016లో పోర్టర్ క్రీక్ సౌత్ ఎమ్మెల్యేగా తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు.అలాగే డిప్యూటీ ప్రీమియర్గా, ఇంధనం, గనులు, ఆర్ధికాభివృద్ధి మంత్రిగా పనిచేశారు.
ప్రస్తుతం రంజ్ పిళ్లై ఆర్ధికాభివృద్ధి, పర్యాటకం, సాంస్కృతిక శాఖల మంత్రిగా వున్నారు.
2012 నుంచి యుకాన్ ప్రీమియర్గా శాండీ సిల్వర్ విధులు నిర్వర్తిస్తున్నారు.ఇప్పుడు ఈ పదవిని రంజ్ పిళ్లై చేపట్టనున్నారు.ఈయన కంటే ముందు 2000- 01 మధ్య బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్కు ఉజ్జల్ దోసాంజ్ ప్రీమియర్గా పనిచేశారు.
తద్వారా ఇండో కెనడియన్ల వారసత్వ చరిత్రలో తొలి ప్రీమియర్గా ఎన్నికైన తొలి వ్యక్తిగా ఉజ్జల్ చరిత్ర సృష్టించారు.గతేడాది వాంకోవర్లోని భారత కాన్సులేట్ నిర్వహించిన ప్రవాసీ భారతీయ దివాస్ వేడుకల్లో పిళ్లై పాల్గొన్నారు.
మరోవైపు… యుకాన్ ప్రీమియర్గా ఎంపికైన రంజ్ పిళ్లైని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అభినందించారు.ఈ మేరకు ట్రూడో కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.పిళ్లైతో కలిసి పనిచేయడానికి తాను ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు ట్రూడో తెలిపారు.రంజ్కు భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు.