అమెరికాలో భారతీయులే టార్గెట్గా ఇటీవల విద్వేషదాడులు , ఇతర నేరాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.గత వారం కూడా ఓ ఇండో అమెరికన్ ఫుడ్ డెలివరి బాయ్పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడో దుండగుడు .
ఈ సంఘటన మరిచికపోముందే .కాలిఫోర్నియా రాష్ట్రంలో కిడ్నాప్కు గురైన భారతీయ కుటుంబం కథ విషాదాంతమైంది.దుండగుల చేతిలో అపహరణకు గురైన ఎనిమిది నెలల చిన్నారి సహా ఆమె తల్లిదండ్రులు, వారి సమీప బంధువు ఓ తోటలో శవాలై తేలారు.వీరిని జస్దీప్ సింగ్, జస్లీన్ కౌర్, ఎనిమిది నెలల చిన్నారి అరూహి ధేరితో అమన్దీప్ సింగ్గా గుర్తించారు.
తాజాగా భారత సంతతి విద్యార్ధి దారుణహత్యకు గురయ్యాడు.ఇతనిని 20 ఏళ్ల వరుణ్ మనీష్ చద్దాగా గుర్తించారు.
ఇతను పర్డ్యూ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు.హాస్టల్లో తోటి రూమ్మేట్ చేతిలో వరుణ్ హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడిని దక్షిణ కొరియోలోని సియోల్కు చెందిన 22 ఏళ్ల జీ మిన్ షాగా గుర్తించినట్లు పర్డ్యూ పోలీస్ చీఫ్ లెస్లీ వైటే తెలిపారు.వరుణ్ శరీరంపై కత్తి పోట్లు కనిపించాయని.
వాటి వల్లే అతను ప్రాణాలు కోల్పోయాడని పోస్ట్మార్టం నివేదిక చెబుతోంది.
యూనివర్సిటీ క్యాంపస్కు పశ్చిమ భాగాన వున్న మెక్కట్చియాన్ హాల్ నుంచి బుధవారం మధ్యాహ్నం 12.44 గంటలకు పర్డ్యూ యూనివర్సిటీ పోలీస్ విభాగానికి 911 కాల్ వచ్చిందని వర్సిటీ ప్రతినిధి మీడియాకు తెలిపారు.నిందితుడు షా స్వయంగా ఈ కాల్ చేశాడని ఆయన చెప్పారు.
ఈ ఘటనపై పర్డ్యూ యూనివర్సిటీ ప్రెసిడెంట్ మిచ్ డేనియల్స్ మాట్లాడుతూ.పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారని తెలిపారు.
గణాంకాల ప్రకారం.పర్డ్యూ యూనివర్సిటీలో జనవరి 2014 తర్వాత క్యాంపస్లో జరిగిన తొలి హత్య ఇదే.వరుణ్ మరో 10 రోజుల్లో తన 21వ పుట్టినరోజును జరుపుకోనున్నారు.కానీ ఇంతలోనే ఈ దారుణం జరిగింది.2020లో పార్క్ ట్యూడర్ హైస్కూల్ నుంచి ఇతను గ్రాడ్యుయేషన్ చేశాడు.అదే ఏడాది నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్లో సెమీఫైనలిస్ట్.