సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శ్రీలంకలోని ప్లాంటేషన్ ప్రాంతాలలో భారత సంతతికి చెందిన లబ్ధిదారులకు, ప్రధానంగా తమిళులకు హౌసింగ్ ప్రాజెక్ట్ మూడవ దశ కింద నిర్మించిన 1000 ఇళ్లను అందజేసినట్లు శ్రీలంకలోని భారత హైకమీషన్ ఆదివారం ప్రకటించింది.ఏడు జిల్లాల్లో విస్తరించి వున్న తోటల ప్రాంతాలలో భారత్ అందించిన గ్రాంట్ సాయంతో 4,000 ఇళ్లను నిర్మిస్తున్నట్లు హైకమీషన్ పేర్కొంది.
భారత హైకమీషనర్ గోపాల్ బాగ్లే, మంత్రి నమల్ రాజపక్ష, ఎస్టేట్ హౌసింగ్ అండ్ కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాఖ సహాయ మంత్రి జీవన్ తొండమాన్ సంయుక్తంగా లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేశారు.
కోటగలలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు ఎస్బీ డిసానాయక్, ఎం రామేశ్వరన్ తదితరులు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా భారత హైకమీషనర్ బాగ్లే.తమిళంలో పొంగల్ శుభాకాంక్షలు తెలియజేశారు.
శ్రీలంకకు భారత్ అండగా నిలుస్తుందని, తమిళ సంతతి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.శ్రీలంక ఆర్ధిక మంత్రి బాసిల్ రాజపక్షే, భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ల మధ్య శ్రీలంక ఆర్ధిక వ్యవస్ధను బలోపేతం చేసేందుకు భారత్ చేపట్టిన ప్రాజెక్ట్లపై చర్చలు జరిపిన రోజునే ఇళ్లు అందజేయడం విశేషం.
ఇదే సమయంలో శ్రీలంక ప్రజలకు జైశంకర్ పొంగల్ శుభాకాంక్షలు తెలియజేశారు.భారత్ ఎల్లప్పుడూ శ్రీలంకకు అండగా నిలుస్తుందని .కోవిడ్ 19 కారణంగా ఎదుర్కొంటున్న ఆర్ధిక, ఇతర సవాళ్లను అధిగమించడానికి అన్ని విధాలుగా మద్ధతు ఇస్తామని జైశంకర్ హామీ ఇచ్చారు.ఇరుగు పొరుగు దేశాలుగా భారత్- శ్రీలంకలు పరస్పర ఆర్ధిక సంబంధాల ద్వారా లాభపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
హైకమిషన్ తెలిపిన వివరాల ప్రకారం, ఇండియన్ హౌసింగ్ ప్రాజెక్ట్ అనేది శ్రీలంకలో వివిధ దశల్లో భారత్ నిర్వహిస్తోన్న కార్యక్రమం.ఇప్పటి వరకు అక్కడ 3000 ఇళ్లను లబ్ధిదారులకు అందజేయగా.
మిగిలిన ఇళ్లు నిర్మాణ దశలో వున్నాయి.మొదటి, రెండో దశల్లో దేశంలోని నార్త్, ఈస్ట్రన్ ప్రావిన్సుల్లో దాదాపు 46,000 ఇళ్లను నిర్మించడమో, మరమ్మత్తులు చేయడమో జరిగింది.
తదుపరి దశలో ప్లాంటేషన్ ప్రాంతాల్లో మరో 10000 ఇళ్లను నిర్మించనున్నారు.మొత్తంగా ఈ ప్రాజెక్ట్ కింద 60,000 ఇళ్లను నిర్మించాలన్నది భారత ప్రభుత్వం టార్గెట్.