ఎప్పుడూ క్లిన్ ఇమేజ్ తో ఎదురు వారికి నీతులు చెప్పడమే తప్ప చెప్పించుకోవడం తమకు చేతకాదు అన్న నైజం లో ఉండే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వరంలో ఇప్పుడు తేడా కనబడుతోంది.గతంలో కంటే ఇప్పుడు తెలంగాణ లో పరిపాలన బాగుంటుంది అని ఆశపడ్డవారంతా టీఆర్ఎస్ మీద తిట్ల వర్షం కురిపిస్తున్నారు.
రెండోసారి అధికారం దక్కించుకున్న తరువాత ఆ పార్టీ నాయకుల్లో గర్వం మితిమీరిన స్థాయిలో పెరిగిపోయిందని విమర్శలు సైతం పెద్ద ఎత్తున వస్తున్నాయి.గత కొంత కాలంగా కేసీఆర్ తీసుకుంటున్న అన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నట్టే కనిపిస్తున్నాయి.
మొదట్లోనే అంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రిమండలి ఏర్పాటు చేయకుండా మూడు నెలలపాటు నాన్చడం విమర్శలపాలయ్యింది.దానికంటే ముందు తన కుమారుడు కేటీఆర్ ను టీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా నియమించడం కూడా పార్టీలోనూ, ప్రజల్లోనూ అసంతృప్తికి కారణం అయ్యింది.
అలాగే టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కష్టపడ్డ హరీష్ రావును మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం విమర్శలపాలయ్యింది.తాజాగా రెవెన్యూ శాఖను మరో ప్రభుత్వ శాఖలో విలీనం చేస్తామని ప్రకటించడం, రెవెన్యూ ఉద్యోగులు అందరూ లంచగొండులు అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రకటించడం కూడా వివాదాస్పదం అయ్యింది.

ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజలను రెచ్చగొట్టేలా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, తెలంగాణ ఉద్యమం సమయంలో పనికొచ్చిన ఉద్యోగులు ఇప్పుడు పనికిరాకుండా పోయారా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.ఇక తాజాగా ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల ప్రకటనలో జరిగిన అవకతవకల వల్ల ఇంతా బయటా టీఆర్ఎస్ భారీ విమర్శలు ఎదుర్కొంది.ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకల వల్ల దాదాపు 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం వెనుక ప్రభుత్వ తప్పిదాలే కనిపిస్తున్నాయి.దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత ప్రభుత్వం చవి చూస్తోంది.
రెండో సారి అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఇంత వ్యతిరేకత చవిచూడడం పార్టీ శ్రేణులకు కూడా మింగుడుపడడం లేదు.