సూర్యాపేట జిల్లా:జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు ఈ నెల నుండి నేరుగా బలవర్ధకమైన బియ్యాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని అంగన్వాడీ కేంద్రాలకు బలవర్ధక బియ్యం పంపిణీపై సంబంధిత శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావుతో కలసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్ల నుండి ఇకపై నేరుగా జిల్లాలో ఉన్న 1209 అంగన్వాడీ కేంద్రాలకు బలవర్ధకమైన బియ్యాన్ని ఈ నెలలో సరఫరా అయ్యేవిధంగా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.అలాగే నిర్దేశించిన రూట్ మ్యాప్ ప్రకారం ముందుగా ఐసీడీఎస్ సూపర్ వైజర్ల ఆధ్వర్యంలో సరఫరా చేయాలని,ఈ ప్రక్రియ నూరుశాతం జరగాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గతంలో పాయింట్ ల నుండి డీలర్ వద్దకు తద్వారా కేంద్రాలకు వెళ్ళేవని తెలిపారు.ఇకపై ఆదనవు భారం లేకుండా సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు.బియ్యం సరఫరాలో ఎక్కడ కూడా జాప్యం జరగకుండా చూడాలని,లేనిచో చర్యలు తప్పవని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఎస్ఓ విజయలక్ష్మి, ఐసీడీయస్ పిడి జ్యోతిపద్మ,డిఎం రాంపతి నాయక్, సీడీపీఓలు,సూపర్ వైజర్లు,పాయింట్ ఇంఛార్జీలు తదితరులు పాల్గొన్నారు.