మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి నెల్లూరులో ఇప్పుడు మరో తలనొప్పి మొదలైనట్లు వినిపిస్తోంది.ఇప్పటికే జిల్లాలో మంత్రి.
ఎమ్మెల్యేల వ్యతిరేక గళం వినిపిస్తున్న నేపథ్యంలో సొంత ఇంటినుంచే తలపోటు తెప్పించ్చే పరిస్థితి వచ్చింది.వైసీపీ బలంగా ఉన్న నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం వర్గ పోరు తప్పేలా లేదంటున్నారు.
గత ఎన్నికల్లో ఈ జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.ఈ సారి మాత్రం నేతల మధ్య ఉన్న విభేదాలు ఆ పార్టీకి తలనొప్పి తెస్తున్నాయని అంటున్నారు.అయితే నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కు ఇంటిపోరు మొదలైందని అంటున్నారు.
మంత్రి కాకాణితో…
వైఎస్ జగన్ మొదటి కేబినెట్ విస్తరణలో కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.అయితే శాఖపై పట్టుకంటే ప్రత్యర్థి పార్టీ నేతలపై విమర్శలకే పరిమితమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.ఇక రెండోసారి జగన్ కేబినెట్ విస్తరణలో అనిల్ ను కంటిన్యూ చేయలేదు.దీంతో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డిని మంత్రి పదవి వరించింది.అయితే ఈ క్రమంలో అనిల్ చేసిన వ్యాఖ్యలు హీటెక్కించాయి.
తాను మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి తనపై ఎలాంటి ప్రేమ అనురాగం చూపారో అంతకు రెట్టింపు తాను కూడా చూపిస్తానని అనిల్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.దీంతో అనిల్ కాకాణిని పిలిపించి వైసీపీ అధిష్టానం మాట్లాడాల్సి వచ్చింది.
అలాగే మరోవైపు మంత్రిగా ఉన్నప్పుడు అనిల్ వ్యవహరించిన తీరుతో ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి తదితరులు అనిల్ కు దూరమయ్యారని సమాచారం.
సొంతఇంటి నుంచే అసమ్మతి పోరు.!
ఇక ఇవి చాలవన్నట్టు ప్రస్తుతం అనిల్ కు సొంత ఇంటిలోనే అసమ్మతి పోరు మొదలయ్యిందని అంటున్నారు.నెల్లూరు కార్పొరేషన్ లో అనిల్ కుమార్ బాబాయ్ రూప్ కుమార్ డిప్యూటీ మేయర్ గా ఉన్నారు.
వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి రూప్ కుమార్ ఎమ్మెల్యే అభ్యర్థిగా దించుతారని వార్తలు వస్తున్నాయి.ఆయనకు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి తదితరులు మద్దతు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు.
ఎందుకంటే ఇటీవల జరిగిన మునిసిపల్ కార్పొరేషన్ సమావేశాల్లో అనిల్ కుమార్ వర్గానికి చెందిన కార్పొరేటర్ తో డిప్యూటీ మేయర్ గా ఉన్న రూప్ కుమార్ కొట్లాటకు దిగడం నెల్లూరు రాజకీయాలను హీటెక్కించింది.
ఈ పరిణామాలతో అనిల్ రూప్ కుమార్ మధ్య సంబంధాలు చెడిపోయాయని అంటున్నారు.ఇప్పటిదాకా ఒకే కుటుంబంగా ఉండి ఒకే ఆఫీసు ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్న మంత్రి అనిల్, రూప్ కుమార్ ప్రస్తుతం వేర్వేరుగా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారని అంటున్నారు.రూప్ కుమార్ యాదవ్ సొంతంగా ఆఫీసును పెట్టుకున్నారని.
ఈ కార్యక్రమానికి మద్దతిస్తున్న 11 మంది కార్పొరేటర్లు వచ్చారనే టాక్ వినిపిస్తోంది.అయితే రూప్ కుమార్ కు తెర వెనుక వైసీపీ నేతలే మద్దతు ఇస్తున్నారని.
లేదంటే ఆయన ఇంత దూకుడుగా వెళ్లరని అనిల్ వర్గం అనుమానిస్తోంది.