-ఋషికేష్లో చాతుర్మాస్య దీక్షకు అంకురార్పణ -గురు పూజా మహోత్సవం సందర్భంగా వ్యాస పూజ
లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ నిర్భయంగా ధర్మ పోరాటం చేయడంలో విశాఖ శ్రీ శారదాపీఠానికి ఉన్న ధార్మిక శక్తి మరే పీఠానికీ లేదని స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి స్పష్టం చేసారు.గడిచిన మూడు దశాబ్దాలుగా విశాఖ శారదాపీఠం తరహా ధర్మ పోరాటాలను మరే పీఠం చేపట్టలేదని అన్నారు.
ఈకారణంగానే విలక్షణమైన పీఠంగా విశాఖ శ్రీ శారదాపీఠం పేరు తెచ్చుకుందని తెలిపారు.బుధవారం ఋషికేష్ వేదికగా అక్కడి ఆశ్రమంలో చాతుర్మాస్య దీక్షకు ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామితో కలిసి అంకురార్పణ చేసారు.
ఈసందర్భంగా తెలుగు రాష్ట్రాలు, ఢిల్లీ ప్రాంతాల నుంచి హాజరైన భక్తులనుద్దేశించి స్వరూపానందేంద్ర మాట్లాడారు.తమ పీఠం తాత – తండ్రుల నుంచి వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి లాంటిది కాదని స్పష్టం చేసారు.
తపశ్శక్తితో ఏర్పడిన, జ్ఞాన పరంపరతో కూడిన పీఠమని అన్నారు.గౌడ పాదాచార్యుల వారు ప్రతిపాదనలతో ఆదిశంకరాచార్యులు భాష్య రచన చేసారని, అటువంటి గౌడ పాదుల వారి పరంపర తమ పీఠానికుందని స్పష్టం చేసారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో మహిమలను చూపించిన ఘనత విశాఖ శారదాపీఠానికే దక్కుతుందన్నారు.మేధావుల ముసుగులో తిరిగే కుహనా శక్తులను ఎదిరించి లోక కళ్యాణం కోసం ధర్మ పోరాటం చేయడానికి నిర్భయంగా ముందుకు సాగుతామని తెలిపారు.
తపస్సు కోసం ఏటా నాలుగు నెలలు దేవభూమి ఋషికేష్లోనే గడుపుతున్నామని అన్నారు.తమ తపస్సు కారణంగా వచ్చే పుణ్యమంతా ప్రేమ పూర్వకంగా పీఠాన్ని ఆశ్రయించే భక్తులకే దక్కుతుందని స్పష్టం చేసారు.
ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి మాట్లాడుతూ గురువులతో పోల్చే వస్తువేదీ ఈ విశ్వంలో లేదని అన్నారు.కలియుగానికి జగద్గురువులు ఆది శంకరాచార్యులేనని స్పష్టం చేసారు.
*శాస్త్రోక్తంగా చాతుర్మాస్య దీక్షకు అంకురార్పణ* సనాతన హైందవ ధర్మంలో విశిష్ట ప్రాధాన్యం ఉన్న చాతుర్మాస్య దీక్షకు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేసారు.ఉదయం గంగానదీ తీరంలో పూజలు చేశారు.
గంగమ్మ ఒడిలో పవిత్ర స్నానమాచరించారు.ఆ తర్వాత గోమాతను పూజించారు.
గురు పూజా మహోత్సవం సందర్భంగా వ్యాస పూజ నిర్వహించారు.ఈ పూజలో శ్రీకృష్ణుడు, వ్యాసుడు, దక్షిణామూర్తి సహా 45 మంది గురువులను ఆరాధించారు.







