నల్లగొండ జిల్లా: వేములపల్లి మండల పరిధిలో లక్ష్మీదేవిగూడెం, ఆమనగల్లు,రావులపెంట ( Lakshmidevigudem, Amanagallu, Raolapenta )గ్రామాలకు చెందిన చిన్న, సన్నకారు,కౌలు రైతులు రావులపెంటలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రం మరియు మిర్యాలగూడలోని అంకూర్ దుకాణంలో వరి విత్తనాలు కొనుగోలు చేసి,వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేశారు.వారంతా ఉన్న కొద్దిపాటి భూమికి తోడు కొంత కౌలుకు తీసుకొని వరి సాగు చేసిన వారే.
పంట వేసి రెండు,మూడు నెలలు కాకముందుకే సగానికి సగం పొలం మొత్తం బెరుకులుగా మారడంతో ఏం చేయాలో తెలియక అన్నదాతలు లబోదిబోమంటున్నారు.ఈ సందర్భంగా పలువురు బాధిత రైతులు మాట్లడుతూ అప్పులు చేసి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి,ఎంతో నమ్మకంతో వ్యాపారుల వద్ద వరి విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేశామని,తీరా పంట వేసి రెండు నెలలు కాకముందే ధాన్యం బెరుకులుగా మారడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డామని,నకిలీ విత్తనాల( Fake seeds ) బారినపడి తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నష్టపోయిన వారంతా చిన్న,సన్నకారు కౌలు రైతులమేనని,ఎకరానికి 40 వేలు పెట్టుబడులు పెట్టామని,తీరా చూస్తే మూడు రకాలుగా పంట వచ్చిందని,ఒకచోట ఇప్పుడే వెన్నుతీస్తుంటే, మరోచోట పంట కోత దశకు వచ్చిందని,ఇంకో చోట విత్తనాలు పచ్చిగా ఉన్నాయని,దీనితో ఏం చేయాలో అర్థంకాక అయోమయంలో ఉన్నామని వాపోతున్నారు.విత్తనాలు కొనుగోలు చేసిన వ్యాపారి వద్దకు వెళ్లి అడిగితే కంపెనీ వాళ్ళని పంపిస్తాము వాళ్లతో మాట్లాడుకోండని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని,ఇంత జరుగుతున్న జిల్లాలో వ్యవసాయ అధికారులు పట్టించుకోవడంలేదని,అధికారులు పర్యవేక్షణ కొరవడంతోనే విత్తన వ్యాపారులు ఈ దారుణానికి వడగట్టారని,అదే రైతుల పాలిట శాపంగా మారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు
.