రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రతి గ్రామం శుభ్రంగా ఉండేలా పరిశుభ్రత పనులు చేయించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.స్వచ్చత, పరిశుభ్రత తదితర అంశాలపై జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నిత్యం ఉదయం 9 గంటలకు కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సూచించారు.గ్రామంలో ఎక్కడా నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని, మురికి కాలువలు లేని చోట కమ్యూనిటీ సోక్ పిట్ నిర్మించాలని ఆదేశించారు.
తాగు నీరు సరఫరాలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.పైప్ లైన్ లలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే సరి చేయించాలని సూచించారు.ప్రతి రోజూ గ్రామాల్లో సేకరించే చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి, సెగ్రిగేషన్ చేయించాలని పేర్కొన్నారు.కంపోస్టు ఎరువు తయారు చేసి విక్రయించాలని వివరించారు.
ఇంకా ఎక్కడైనా వ్యక్తిగత మరుగు దొడ్లు నిర్మించుకొని వారు ఉంటే వారికి పూర్తి చేయాలని ఆదేశించారు.జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఇంటి ఇతర పన్నులు 100 శాతం వసూలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
విద్యాలయాల పై ప్రత్యేక దృష్టి
జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాలయాలు, హాస్టళ్లు, అంగన్వాడి కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.విద్యాలయాల ఆవరణలో చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలని, చుట్టూ పిచ్చి మొక్కలు తొలగించాలని సూచించారు.
ప్రతి విద్యాలయానికి నిత్యం నీరు సరఫరా అయ్యేలా చూడాలని ఆదేశించారు.నిత్యం పారిశుధ్య పనులు చేయించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పంచాయతీ అధికారి శేషాద్రి, డీఎల్పీఓ నరేష్, ఎస్బీఎం సురేష్ తదితరులు పాల్గొన్నారు.







