ప్రస్తుత కాలంలో చదువు చాలా ఖరీదైందనే సంగతి తెలిసిందే.నీట్ పరీక్షలో( NEET ) అర్హత సాధించాలంటే ఏ స్థాయిలో కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్లు నీట్ లో మంచి ఫలితాలను సాధించడం సులువైన విషయం కాదు.అయితే గొర్రెల కాపరి కూతుళ్లు మాత్రం కన్న కలను నిజం చేసుకోవడంతో పాటు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.
ఎన్నో అవరోధాలను ఎదుర్కొని గొర్రెల కాపరి కూతుళ్లు ఈ స్థాయికి చేరుకున్నారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని నంగల్ తులసీదాస్ గ్రామానికి చెందిన కరీనా యాదవ్,( Kareena Yadav ) రీతూ యాదవ్( Ritu Yadav ) దగ్గరి బంధువులు.
వీళ్లిద్దరి తల్లీదండ్రులు గొర్రెలను మేపడం ద్వారా జీవనం సాగిస్తున్నారు.గొర్రెల ద్వారా వచ్చే ఆదాయంతోనే వీళ్లు పిల్లలను చదివించేవారు.జైపూర్ కు వీళ్లు నివశించే గ్రామం 25 కిలోమీటర్ల దూరంలో ఉండేది.ఈ గ్రామంలో నివశించే ప్రజలు సరైన వైద్య సేవలు గ్రామంలో లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

గ్రామ ప్రజల కష్టాలను చూసిన రీతూ, కరీనా తాము డాక్టర్లు అయితే మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావించారు.తల్లీదండ్రుల సహాయంతో ఇంటర్ వరకు చదివారు.రీతూ తండ్రి అరుదైన వ్యాధి వల్ల కంటిచూపును కోల్పోగా కరీనా కుటుంబానికి సొంతంగా ఇల్లు కూడా లేదు.కరీనా తండ్రి లంగ్ క్యాన్సర్ తో బాధ పడుతున్నారు.

అయితే ఇన్ని ఇబ్బందులు ఉన్నా రీతూ, కరీనా మాత్రం తమ చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు.ఈ ఇద్దరికీ వరుసకు మేనమామ అయిన తస్కరీ ఒక స్వచ్చంద సంస్థ సహాయంతో వీళ్లిద్దరికీ కోచింగ్ ఇప్పించారు.ఈ ఏడాది విడుదలైన ఫలితాల్లో కరీనా 680 మార్కులు సాధించగా రీతూ 645 మార్కులు సాధించారు.ఎంతో కష్టపడటం వల్లే కరీనా, రీతూ మంచి ఫలితాలను సొంతం చేసుకున్నారు.
రీతూ, కరీనా కన్న కలలను నెరవేర్చుకోవడంతో గ్రామస్థులు సంతోషిస్తున్నారు.







