అగ్ర రాజ్యం అమెరికాలో ఉద్యోగం, వ్యాపారం చేయడానికి వలస వాసులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు.ముఖ్యంగా అక్కడ ఉన్నత విద్య కోసం ప్రపంచ దేశాల నుంచీ విద్యార్ధులు పోటీ పడుతుంటారు.
అమెరికాలో చదువుకుంటే అక్కడే మంచి ఉద్యోగం సంపాదించవచ్చుననే ఆలోచన అందరికి ఉంటుంది.అయితే ఇదంతా గతం ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటోందని అంటున్నారు నిపుణులు.
కరోనా అమెరికాలో ఆర్ధిక, ప్రాణ నష్టాన్ని మాత్రమే కాదు విద్యా విధానంపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.కరోనా దెబ్బకు అమెరికాలోని కాలేజీలు, స్కూల్స్, వర్సిటీలలో చేరే వలస విద్యార్ధుల సంఖ్య అమాంతం తగ్గిపోయింది.
ఏ స్థాయిలో ఈ సంఖ్య తగ్గిందంటే.
అమెరికాలో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 15% మంది విద్యార్ధులు చేరికలు తగ్గిపోయాయట.1948 తర్వాత ఇలా జరగటం ఇదే మొదటి సారని అంటున్నారు పరిశీలకులు.కరోనా మొదలు కొన్న రోజు నుంచీ నేటి వరకూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ చేపట్టిన సర్వేలో ఈ సంచలన నిజాలు బయటపడ్డాయి.73 ఏళ్ళ తరువాత అమెరికా చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటి సారని సదరు సర్వే వెల్లడించింది.
అమెరికా వ్యాప్తంగా ఉన్న 70% కాలేజీలలో 20శాతం మంది విద్యార్ధులు తగ్గిపోయారని, ప్రస్తుతానికి వారి సంఖ్య 10 శాతానికి మిగిలిందని సర్వేలో తేలింది.
ఇదిలాఉంటే అమెరికాలో విద్య కోసం దాదాపు 10 వేల మంది విద్యార్ధులు దరఖాస్తులు పెట్టుకోగా అందులో కేవలం 25 శాతం మంది మాత్రమే చేరారని తెలుస్తోంది.ఇదిలాఉంటే విదేశీ విద్యార్ధులు ఈ స్థాయిలో తగ్గిపోవడానికి ప్రధాన కారణం కరోనా మహమ్మారి అయితే ,కాలేజీలు అధిక సంఖ్యలో ఫీజులు పెంచేయడం మరొక కారణంగా తెలుస్తోంది.
మిగిలిన దేశాలలో వర్సిటీలు రెండవ సంవత్సరం ఫీజుల విషయంలో తగ్గింపు ఇవ్వగా అమెరికాలో మాత్రం ఆ పరిస్థితి లేకపోవడం మరొక కారణంగా తెలుస్తోంది.అన్ని దేశాలతో పోల్చితే భారత్ నుంచీ అమెరికాలో విద్య కోసం వచ్చే వారి సంఖ్య మాత్రం భారీగా తగ్గినట్టు తెలుస్తోంది.
వీరందరూ బ్రిటన్ వంటి దేశాలకు వలసలు వెళ్తున్నారట.