తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పుడూ ఏదో ఒక అలజడి చోటు చేసుకుంటూనే ఉంటుంది.పార్టీ నేతలు అంతా ఏకబిప్రాయంతో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చే విషయంపై దృష్టి సారించకుండా, ఎవరికి వారు తమ ప్రాధాన్యాన్ని, పలుకుబడిని పెంచుకునేందుకు, ప్రయత్నిస్తుండడం, ఒకరి హవా పెరగకుండా మరొకరు వెనక్కి లాగుతుండడం వంటివన్నీ తెలంగాణ కాంగ్రెస్ లో సర్వసాధారణంగా మారిపోయాయి.
మరోవైపు చూస్తే తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.ఈ సమయంలో ఐక్యంగా తమ రాజకీయ ప్రత్యర్థులపై పోరాడాల్సిన నాయకులంతా ఎవరికి వారు పోటీలు పడుతూ, వ్యక్తిగతంగా పలుకుబడిని పెంచుకునే ప్రయత్నం చేస్తుండడం వంటివి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో మరింత పెరిగాయి.
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హత్ సే హత్ జోడో పాదయాత్రను చేపడుతున్నారు.దీనికి పోటీగా మరికొన్ని పాదయాత్రలు మొదలయ్యాయి.ప్రస్తుతం ఏఐసిసి ప్రోగ్రామ్స్ అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ పోరు యాత్ర పేరుతో పాదయాత్రను మొదలుపెట్టారు.దీంతో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ , రంగారెడ్డి జిల్లాలోని పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఇదే రకమైన యాత్రలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇక కాంగ్రెస్ సీనియర్ నేతలుగా పేరుపొందిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు బట్టు విక్రమార్క తో పాటు, మరికొంతమంది సీనియర్ నాయకులు యాత్రలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో గట్టి పట్టున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ జిల్లాలోని సీనియర్ నాయకులు అందర్నీ కలుపుకుని యాత్ర చేపట్టాలని రేవంత్ వర్గం సూచిస్తోంది.అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.ఇదే విధంగా ఎక్కడికక్కడ సీనియర్ నాయకులు పోటాపోటీగా యాత్రలు చేపడుతుండడంతో, సీనియర్ నాయకులు అంతా ఎవరికి వారే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.
దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోందనే ప్రశ్న తెరమీదకు వస్తోంది.