ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణలో పరిపాలన కొనసాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఇప్పటికే కొన్ని వ్యవస్థలలో ప్రక్షాళన మొదలుపెట్టారు.ముఖ్యంగా హైడ్రా , మూసినది ప్రక్షాళన వంటి వ్యవహారాలు రేవంత్ కు మంచి పేరుతో పాటు , వివాదాలకు కేంద్ర బిందువుగాను మారారు.
ఇది ఇలా ఉంటే తెలంగాణలో( Telangana ) మరో వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ రద్దు చేసిన వీఆర్వో వ్యవస్థను( VRO System ) మళ్ళీ తీసుకొచ్చేందుకు రేవంత్ సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ ఉద్యోగుల ఐకాస చైర్మన్ లచ్చిరెడ్డి( JAC Chairman Lacchi Reddy ) చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి.‘ త్వరలోనే వీఆర్వోలు తీపి కబురు వింటారు అంటూ ఆయన ప్రకటించారు.

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్( KCR ) వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారు. ఈ వ్యవస్థ ద్వారా రెవెన్యూ శాఖలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని ఆరోపిస్తూ విఆర్వోలను వివిధ శాఖలలో సర్దుబాటు చేశారు. దీంతో ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిందని అంతా భావించారు.అయితే అప్పట్లో కెసిఆర్ తీసుకున్న నిర్ణయం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది.తాజాగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి విఆర్వో వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన వీఆర్వోలకు నేరుగా బాధ్యతలను అప్పగిస్తారట.
మిగతా పోస్టుల కోసం ప్రత్యేక రాత పరీక్షలు నిర్వహిస్తారని తెలుస్తోంది.

ప్రస్తుతం తెలంగాణలో 3,000 మంది వీఆర్వోలు ఉన్నారు.కొత్తగా మరో 8 పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నారు.తెలంగాణలో ఉన్న 10,909 రెవెన్యూ గ్రామాలకు వీఆర్వోలను నియమించనున్నారట.
తెలంగాణ ఉద్యోగుల ఐకాసా చైర్మన్ లచ్చిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో వీఆర్వో వ్యవస్థ మళ్లీ ప్రారంభం కాబోతుందనే విషయం తెరపైకి వచ్చింది.ఇటీవల మేడ్చల్ జిల్లా తుంకుంటలో నిర్వహించిన విఆర్వోల ఆత్మీయ సమ్మేళనంలో లచ్చిరెడ్డి పాల్గొని విఆర్ఓ వ్యవస్థ కొనసాగి ఉంటే వికారాబాద్, లగచర్ల సంఘటనలు జరిగి ఉండేవి కాదు అని అన్నారు .వీఆర్వోలు, వీఆర్ఏలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని , ఉద్యోగ భద్రత కోసం తాము కృషి చేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు .ఈ వ్యాఖ్యలతో తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ మళ్లీ పురుడుపోసుకోనుంది అనే విషయం అర్థం అవుతోంది.