టిడిపి అధినేత చంద్రబాబు గతంలో మాదిరిగా మొహమాటపు రాజకీయాలను పక్కన పెట్టేశారు.2024 ఎన్నికల్లో గెలుపే ప్రధానంగా బాబు భావిస్తున్నారు.ఆ ఎన్నికల్లో గెలిస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని , లేకపోతే పార్టీని మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందనే భయం బాబును వెంటాడుతోంది.దీనికి తోడు ఏపీ అధికార పార్టీగా ఉన్న వైసిపి ప్రజల్లో మరింత బలం పెంచుకుంటూ ఉండడం, బిజెపి, జనసేన లు పట్టు కొనసాగిస్తూ తమను ఒంటరి చేస్తున్న తీరు, ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్నారు.
అందుకే రాబోయే ఎన్నికల్లో టికెట్ల విషయంలో బాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.వాస్తవంగా 2024 ఎన్నికల్లో యువ నాయకులను ఎక్కువగా ప్రోత్సహించాలని బాబు భావించారు.వారికే టిక్కెట్లు కేటాయిస్తామని ప్రకటించారు.
అయితే ఇప్పుడు మాత్రం బాబు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగానే కనిపిస్తున్నారు.
ప్రతి నియోజకవర్గ పైన బాబు సర్వే చేయించారు.అక్కడ పోటీ చేయబోయే అభ్యర్థుల బలబలగాలు , వైసిపి నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు.
ఆ ఎన్నికల్లో ప్రభావం ఏ విధంగా ఉండబోతుందనేది ముందుగానే బాబు సర్వేల ద్వారా తెలుసుకుంటున్నారు.దీనిలో భాగంగానే వారసులకు టికెట్లు ఇస్తే గెలుపు కష్టమవుతుందని, సీనియర్ నాయకులే రంగంలోకి దిగితే గెలుపుకు డోకా ఉండదనే విషయాన్ని బాబు గుర్తించారు.
ఇప్పటికే రాప్తాడు నియోజకవర్గం నుంచి పరిటాల సునీతను పోటీ చేయాలని బాబు ఆదేశించారు.ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ ధర్మవరం ఇన్చార్జిగా ఉన్నారు.
అక్కడ ఆయన టికెట్ ఆశిస్తున్నప్పటికీ , ఆయనకు టికెట్ ఇచ్చేది లేదని చెప్పేసారట.

అలాగే తాడిపత్రి నియోజకవర్గం నుంచి జెసి ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి పోటీ చేయాలని చూస్తుండగా, ఆయన కాకుండా ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారట.2019 ఎన్నికల్లో అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి పోటీ చేసినా, ఓటమి చెందారు.దీంతో ప్రభాకర్ రెడ్డి నే రంగంలోకి దిగాలని బాబు తేల్చి చెప్పేసారట.
ఇక అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డిని పోటీ చేయాలని బాబు సూచించారట.గత ఎన్నికల్లో దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు.
దీంతో దివాకర్ రెడ్డి వైపే బాబు మొగ్గు చూపిస్తున్నారు.అదీ కాకుండా, ఒక కుటుంబానికి ఒకే టికెట్ అనే రూల్ పెట్టారట.
దీంతో వారసుల కంటే సీనియర్ నాయకులకు గెలుపు అవకాశాలు ఉన్నాయని, సర్వే నివేదికలతో బాబు వారసులను పోటీకి దించేందుకు ఇష్టపడడం లేదట.
.