తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ఏపీ సర్కారుకు నిన్న షాక్ తగిలింది.మద్యం పాలసీలో కొత్త పంథాను ఎంచుకున్న సర్కారుకు హైకోర్టు ధర్మాసనం ముకుతాడు వేసింది.వివరాల్లోకెళితే… గతంలో అమల్లో ఉన్న మద్యం పాలసీ ప్రకారం… బార్ అండ్ రెస్టారెంట్ల కేటాయింపునకు సంబంధించి… ఎక్కువ ధర ఇచ్చేందుకు ముందుకు వచ్చే వారికే అవకాశం చిక్కేది.
ఈ విధానంలో వ్యాపారుల మధ్య పోటీ వాతావరణం పెరగడంతో సర్కారు ఖజానాకు అనుకున్న దానికంటే మరింత మెరుగైన ఆదాయం దక్కేది.
అయితే రాష్ట్ర విభజన తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ విధానాన్ని మార్చేందుకు నడుం బిగించారు.‘ఫస్ట్ కం… ఫస్ట్ సర్వ్’ పేరిట… ఎవరు ముందుగా వస్తే వారికే బార్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు కొత్త మద్యం పాలసీకి రూపకల్పన చేసి జీవో నెం:19ను జారీ చేసింది.దీనిపై దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్… నిన్న సదరు జీవోను నిలుపుదల చేశారు.







