ఢిల్లీ నుంచి అయోధ్యకు బుల్లెట్ రైలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యా పట్టణానికి ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది.ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ నుంచి అయోధ్య నడుమ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును శరవేగంగా అమలులోకి తీసుకు వచ్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.
నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్(NHSRC) వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అధకారులు క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించారు.గంటకు 320 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ బుల్లెట్ రైలు 670 కిలోమీటర్లకు పైగా దూరాన్ని కవర్ చేయనుంది.
దీంతో ప్రయాణ సమయం 2 గంటలు తగ్గనుంది.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీ నుంచి వారణాసి-ప్రయాగ్ రాజ్ ను అనుసంధానిస్తూ హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టును ప్రణాళిక రూపొందించింది.
బుల్లెట్ రైలు కోసం లక్నో – అయోధ్య మధ్య 130 కిలోమీటర్ల పొడవైన ప్రత్యేక ట్రాక్ ను నిర్మించనున్నారు.ఆగ్రా – లక్నో ప్రయాగ్ రాజ్ మీదుగా ఢిల్లీ – వారణాసి మధ్య ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు వస్తున్నది.
ఈ సర్క్యూట్ పరిధిలోనే అయోధ్యను చేర్చారు.ఈ ప్రాజెక్టు కోసం రూ 2లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.బుల్లెట్ ట్రైన్ స్టేషనుకు సమీపంలోనే మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా నిర్మితమవుతుంది.అయోధ్యలో మౌలిక వసతుల కల్పనకు బుల్లెట్ రైలు ప్రాజెక్టు తోడ్పడుతుంది.
ఇప్పటికే విమానాశ్రయ నిర్మాణానికి75 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు.ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి.