కేంద్ర బిజెపి( BJP )పెద్దలను కలిసి ఏపీలో బిజెపితో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లే ఆలోచనతో టిడిపి అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు.బిజెపి ,టిడిపి, జనసేన మధ్య పొత్తు దాదాపు ఖరారు కాబోతున్న నేపథ్యంలో, సీట్ల సర్దుబాటు ఏ విధంగా చేసుకుంటారనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.
అయితే బిజెపి ఎన్ని పార్లమెంటు .ఎన్ని అసెంబ్లీ సీట్లు అడుగుతుంది అనేదానిపై ముందుగానే చంద్రబాబు అంచనాకు వచ్చారు.బిజెపి పొత్తులో భాగంగా ఎక్కువ పార్లమెంట్ సీట్లను కోరుతుందని , అసెంబ్లీ సీట్లు విషయంలో పెద్దగా పట్టింపు ఉండదనే లెక్కల్లో బాబు ఉన్నారు.అందుకే టిడిపి బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో బిజెపికి అసెంబ్లీ సీట్లను కేటాయించాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు.
ఇక పార్లమెంట్ సీట్ల విషయానికి వస్తే బిజెపి కోరిన చోట సీట్లు ఇవ్వాల్సిందేనని, లేకపోతే పొత్తుకు ఒప్పుకునే ఛాన్స్ ఉండదని బాబు అంచనా వేస్తున్నారు .

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బిజెపితో పొత్తు పెట్టుకుని ఏపీలో అధికారంలోకి రాకపోతే , టిడిపి మనుగడే కష్టమవుతుందని, మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే తమ పని అంతే సంగతులు అని చంద్రబాబు టెన్షన్ పడుతున్నారు.అందుకే బిజెపి కోరినన్ని సీట్లు ఇచ్చినా సరే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనకు చంద్రబాబు( Chandrababu naidu ) వచ్చేసారు.ఇంతవరకు బాగానే ఉన్నా… టిడిపి, జనసేన( TDP, Jana Sena ) పొత్తు కుదిరిన తర్వాత ఏపీలో అధికారంలోకి రావడం ఖాయం అనే అభిప్రాయానికి వచ్చిన టిడిపి నేతలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు తీవ్రంగా పోటీ పడుతున్నారు.
ఇప్పుడు బిజెపి కి పొత్తులో భాగంగా సీట్లు కేటాయించాల్సి రావడం, ఇప్పటికే కొన్ని సీట్లు జనసేన( Jana sena )కు కేటాయించబోతున్న నేపథ్యంలో, తమ పరిస్థితి ఏమిటి అనేదానిపైనే వారు టెన్షన్ పడుతున్నారు.

పొత్తులో భాగంగా గతంలో బీజేపీ గెలిచిన సీట్లను ఆ పార్టీ కోరే అవకాశం కనిపిస్తుంది. తాడేపల్లిగూడెం, కైకలూరు ,నరసరావుపేట, తిరుపతి అసెంబ్లీ స్థానాలను అడిగితే ఏం చేయాలనే విషయం పైన చంద్రబాబు ఆలోచనలో ఉన్నారు.ఇక పార్లమెంటు విషయానికి వస్తే విశాఖపట్నం, అరకు, రాజమండ్రి, నరసాపురం ,ఒంగోలు ,రాజంపేట, తిరుపతి స్థానాలను బిజెపి కోరే అవకాశాలు ఉన్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే వీటిలో ఆరు వరకు బిజెపికి పొత్తులో భాగంగా కేటాయించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారట .ఇప్పటికే జనసేనకు మచిలీపట్నం, కాకినాడ, అనకాపల్లి పార్లమెంట్ స్థానాలను పొత్తులో భాగంగా కేటాయించేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతోంది.







