సూర్యాపేట జిల్లా:సబ్ రిజిస్టార్ బలరాం ను అరెస్ట్ చేయాలి.జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలి.
సంఘాలకు అతీతంగా జర్నలిస్టుల నిరసన.జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండించిన కలం యోధులు.
జిల్లాలో పోలీసుల తీరుపై ఉద్యమ బాట.కొత్త బస్టాండ్ వద్ద రాస్తారోకో,భారీగా ట్రాఫిక్ జామ్.జిల్లా కేంద్రంలో జర్నలిస్టులపై పోలీసుల వైఖరిని నిరసిస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఒక్కటై నినదించారు.సూర్యాపేట సబ్ రిజిస్టార్ బలరాం అధికార మదంతో ఇద్దరు పాత్రికేయులను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా వారిపై చెయ్యి చేసుకున్న ఘటనలో పోలీసులు అనుసరిస్తున్న తీరుకు నిరసనగా,సబ్ రిజిస్టార్ పై కేసు నమోదు చేసి,వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం యూనియన్లను అతీతంగా కొత్త బస్టాండ్ సెంటర్ లో ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రజలకు,ప్రభుత్వాలకు తెలియజేస్తూ,సామాజిక స్పృహతో అర్దాకలితో సేవ చేస్తున్న జర్నలిస్టులపై భౌతిక దాడులకు దిగుతున్న వారిని వదిలేసి,జర్నలిస్టులపై అక్రమ కేసుకు బనాయించడం ఏమిటని ప్రశ్నించారు.రాజకీయ పార్టీల నేతలు,అధికారులు,కాంట్రాక్టర్లు,అక్రమ వ్యాపార మాఫియాదారులు,అందరూ జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని,వారికి పోలీసులు కొమ్ముకాస్తూ మరింత వేధిస్తున్నారని అన్నారు.
సమాజంలో జరిగే మంచితోపాటు,చెడును కూడా ప్రజలకు,ప్రభుత్వాలకు తెలిసేలా చేయడం పత్రికల, మీడియా యొక్క బాధ్యతని,తమ బాధ్యతను తాము నిర్వర్తిస్తుంటే తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని ఆగ్రహం వ్యక్తం చేశారు.జర్నలిస్టులపై రాజకీయ నేతల, అధికారుల,పోలీసుల తీరు మారకుంటే భవిషత్ లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా యూనియన్లను అతీతంగా భారీ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి జర్నలిస్టులపై చెయ్యి చేసుకున్న సబ్ రిజిస్టార్ బలరాంపై కేసు నమోదు చేసి,తక్షణమే అరెస్ట్ చేయాలని,పోలీసులు జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.