గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ఏపీ అధికార పార్టీ వైసిపి జనాల్లోకి వెళ్ళింది.ప్రజా ప్రతినిధులు, అధికారులు అంతా జనాల వద్దకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరెవరికి ఎంతెంత లబ్ధి చేకూరింది అనే విషయాలను చెబుతుండడంతో పాటు, స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కార మార్గాలను చూపించే విధంగా ప్రయత్నిస్తూ ఉండటం వంటి వ్యవహారాలతో జనాల్లో వైసీపీ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత తగ్గి, కాస్త సానుకూలత ఏర్పడిన నేపథ్యంలో తెలుగుదేశం కూడా జనాల్లో ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇక నిత్యం జనాల్లోనే ఉంటూ, పార్టీని మరింత బలోపేతం చేయాలని, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం తీసుకొచ్చి ఎన్నికల వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించే విధంగా చేయాలని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే జిల్లాల టూర్ కు చంద్రబాబు శ్రీకారం చుట్టారు .ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది.ఈనెల 15 నుంచి చంద్రబాబు జిల్లా పర్యటనలు ప్రారంభంకానున్నాయి. జూన్ 15 నుంచి నెలకు రెండు జిల్లాల్లో బాబు పర్యటిస్తారు.ఒక్కో జిల్లాలో మూడు రోజుల పాటు మకాం వేసి పరిస్థితులను చక్కదిద్దబోతున్నారు.ఈనెల 15, 16 ,17 తేదీల్లో అనకాపల్లి జిల్లాలోచంద్రబాబు పర్యటిస్తారు.
అక్కడ మొదటి రోజు మినీ మహానాడు బహిరంగ సభను ఏర్పాటు సభలో పాల్గొంటారు.రెండో రోజు పార్టీ కీలక నాయకులతో సమావేశం నిర్వహిస్తారు.
మూడోరోజు రోడ్ షో నిర్వహించనున్నారు.

15వ తేదీ చోడవరంలో నిర్వహించే జిల్లా మహానాడులో చంద్రబాబు పాల్గొంటారు.16 న అనకాపల్లిలోని నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారు.17వ తేదీన చీపురుపల్లిలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొనబోతున్నారు.ఇదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పర్యటనలు చేపట్టి, వైసిపి ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని, ప్రజల్లో తెలుగుదేశం పార్టీపై పట్టు పెంచాలనే విధంగా చంద్రబాబు ముందడుగు వేస్తున్నారు.







