పకడ్బందీగా పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలి..

రాజన్న సిరిసిల్ల జిల్లా: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జిల్లాలో పకడ్బందిగా నిర్వహించేందుకుఅవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అన్నారు.

సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ముఖ్య ఎన్నికల అధికారులు రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు, ఈవిఎం యంత్రాల తరలింపు, కౌంటింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్ లకు పలు సూచనలు చేశారు.వీడియో సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులతో మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలు, యువత, దివ్యాంగులను పోలింగ్ లో భాగస్వామ్యం చేసేలా, ఆ సందేశం స్పష్టంగా తెలిసేలా మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు.ఎన్నికల ప్రచార సమయం సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాలలో నవంబర్ 28 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని, అనంతరం 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ పాటించాల్సి ఉంటుందని అన్నారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రిటర్నింగ్ అధికారులు సైలెన్స్ పీరియడ్ లో పాటించాల్సిన నిబంధనలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు, అభ్యర్థులకు సమాచారం అందించాలని, ఇతర ప్రాంతాల నుంచి ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు వెళ్లేలా చూడాలని అన్నారు.పోలింగ్ నిర్వహణకు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని, విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు కల్పించాలని అన్నారు.

Advertisement

పోలింగ్ అనంతరం పోలింగ్ కేంద్రాల నుంచి కౌంటింగ్ కేంద్రం స్ట్రాంగ్ రూమ్ కు ఈ.వి.ఎం.యంత్రాల తరలింపు కోసం అవసరమైన వాహనాలను సిద్ధం చేయాలని అన్నారు.పోలింగ్ రోజు పోలింగ్ సిబ్బంది సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, మాక్ పోల్ నిర్వహించాలని, పోలింగ్ సజావుగా జరిగే విధంగా విధులు నిర్వహించాలని, వల్నరబుల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.

పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని, జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News