నేడు విజయవాడలో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందించి సన్మానించనున్న సీఎం వైయస్ జగన్ భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా రాష్ట్రప్రభుత్వం సోమవారం గురుపూజోత్సవాలను ఘనంగా నిర్వహించనుంది.ఇందుకు సంబంధించి విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని 176 మంది టీచర్లు, అధ్యాపకులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేయనుంది.ఉదయం 10 గంటలకు విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్లో జరిగే కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందించి సన్మానిస్తారు.
పాఠశాల విద్యా శాఖ నుంచి 58 మంది ఉపాధ్యాయులు, ఇంటర్ విద్య నుంచి 19 మంది, ఉన్నత విద్య నుంచి 60 మంది అధ్యాపకులు, బాషా సాంస్కృతిక శాఖ నుంచి ఐదుగురు, కేజీబీవీల నుంచి ముగ్గురు, జాతీయస్ధాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ఐదుగురు ఈ పురస్కారాలను అందుకోనున్నారు.కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ విద్యాలయ అవార్డులు సాధించిన 26 పాఠశాలలను కూడా ఈ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కే.సురేష్కుమార్ పేర్కొన్నారు.గురు పూజోత్సవం సందర్భంగా జరిగే ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి జే.శ్యామలరావు, ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమ చంద్రారెడ్డి పాల్గొంటారు.