ఏపీలో అమరావతి ఉద్యమం రాజుకుంది.అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర మొదలైంది.
ఈ యాత్రకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా, కోర్టు నుంచి కొన్ని షరతులతో కూడిన అనుమతులు తెచ్చుకుని ఈ ప్రాంత రైతులు పాదయాత్రను మొదలుపెట్టారు.రాజధానిగా అమరావతిని కొనసాగించాలని మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు .ఇప్పటికే అమరావతి ఉద్యమానికి బిజెపి, కాంగ్రెస్ , జనసేన, టిడిపి వంటి పార్టీలు మద్దతు ప్రకటించాయి.వైసీపీ మాత్రం తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని, అమరావతిని కూడా శాసన రాజధాని చేసి అభివృద్ధి చేస్తామంటూ ప్రకటనలు చేస్తోంది.
కొద్ది నెలల క్రితం ఏపీ బీజేపీ కూడా అమరావతి లోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.పాదయాత్ర కూడా ఈ ప్రాంతంలో చేపట్టారు .బిజెపికి అంతంత మాత్రమే స్పందన వచ్చింది.అసలు దోషి బిజెపినే అన్నట్లుగా ఆ ప్రాంత రైతులు, ప్రజలు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటనలో విమర్శలు చేయడం వంటివి చోటు చేసుకున్నాయి.
దీంతో అమరావతి విషయంలో వైసిపి ని అడ్డం పెట్టుకుని కేంద్రమే అడ్డుకుంటుందనే అనుమానాలు ఈ ప్రాంత వాసుల్లో మొదలయ్యాయి.ఇదే సమయంలో బిజెపి తాము అమరావతికి నిజంగానే అండగా ఉంటామని నిరూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కానీ ఏపీ బీజేపీ నేతలు ఇప్పటి వరకు రాజధాని విషయంలో పూర్తిగా వైసిపి ప్రభుత్వందే నిర్ణయమని, విమర్శలు చేస్తూ వచ్చారు.

ఇప్పుడు కూడా అదే తరహా విమర్శలు చేస్తూ రైతులు, ప్రజల మద్దతు పొందేందుకు ప్రయత్నించినా, అది వృధానే అవుతుంది .ఎందుకంటే వైసీపీతో కలిసి బిజెపిని అమరావతిని అడ్డుకుంటుందని, మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చిందని ఈ ప్రాంత రైతులు ప్రజలు బలంగా నమ్ముతున్నారు.దీంతో తాము నిజంగానే మూడు రాజధానులను సమర్థించడం లేదని , అమరావతి కే కట్టుబడి ఉన్నామని నిరూపించుకోవాల్సిన బాధ్యత బిజెపి పై పడింది.
కానీ అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నంత స్థాయిలో మరే పార్టీని ఇక్కడ జనాలు నమ్మకపోవడం బిజెపికి ఇబ్బందికరంగానే మారింది .ప్రధానంగా ఓ సామాజిక వర్గం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండడం , వారిలో ఎక్కువమంది టీడీపీ సానుభూతిపరులే ఉండడం వంటి కారణాలతో బిజెపి ఈ విషయంలో ఏం చెప్పినా ఎవరూ నమ్మలేని పరిస్థితి .







