లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఒకపక్క జనాలే కాకుండా మూగ జీవాలు కూడా తిండి దొరక్క అల్లాడిపోతున్నాయి.కొందరు అయితే ప్రత్యేకంగా ఈ మూగ జీవాలకు తిండి అందించడం కోసం తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
అయితే మూగ జీవాలపై ఇంతగా ప్రేమ చూపించేవారు ఎలా ఉన్నారో, అలానే వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా వాటిపై దారుణంగా ప్రవర్తించే వారు కూడా చాలా మంది ఉన్నారు.అహ్మదాబాద్ లో ఒక వ్యక్తి చేసిన దారుణం గురించి తెలుసుకుంటే మాత్రం ఇలాంటి వారు కూడా ఉంటారా అని అనిపించక మానదు.
తన కారుపై కుక్క కూర్చోడాన్ని జీర్ణించుకోలోక ఆ వ్యక్తి దాన్ని తుపాకీతో దారుణంగా కాల్చిచంపేశాడు.గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటుచేసుకుంది.
రాణిప్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంటులో నివసిస్తున్న జిగర్ పంచాల్ తన కారును అపార్ట్మెంట్ లోపల కాకుండా బయట పెట్టుకుంటున్నాడు.అయితే దానిపై ‘కూర్చోవడం నేరం’ అని తెలియని ఒక వీధికుక్క సేదతీరడానికి కూర్చుండిపోయింది.
గోళ్ల గీతలు కూడా కొద్దిగా పడ్డాయి.
మిగతా కుక్కలు కూడా కింద కూర్చుని నిద్రపోయాయి.
ఇది చూసిన జుగర్ పిచ్చికుక్కలా రెచ్చిపోయాడు.ఇంట్లోంచి ఎయిర్ గన్ తీసుకొచ్చి కాల్పులు జరిపారు.
అయితే ఆ సమయంలో స్థానికులు అడ్డుకోవడంతో ఇంట్లోకి వెళ్లిపోయాడు.అనంతరం కొద్దీ సేపటి తర్వాత మళ్లీ కాల్పులు వినిపించాయి.
స్థానికులు వెళ్లి చూడగా కారు పక్కన ఓ కుక్క నిర్జీవంగా కనిపించింది.దీనితో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు అరెస్ట్ చేసి జంతుహింస కింద కేసుపెట్టినట్లు తెలుస్తుంది.