ఇజ్రాయెల్ – హమాస్( Israel–Hamas ) యుద్ధం నానాటికీ తీవ్ర రూపు దాల్చుతోంది.ఈ ప్రాంతంలో శాంతి నెలకొనేలా చేసేందుకు అంతర్జాతీయ సమాజం తీవ్రంగా కృషి చేస్తోంది.
కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయి.హమాస్ను పూర్తిగా నేలమట్టం చేసేవరకు తగ్గేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ స్పష్టం చేశారు.
మరోవైపు ఈ యుద్ధ బాధితులకు మానవతా సాయం అందిస్తోన్న సామాజిక కార్యకర్తలు ప్రాణాలు కోల్పోతున్నారు.తాజాగా ఓ భారతీయుడు అలాగే మరణించాడు.

ఐక్యరాజ్యసమితికి చెందిన భారతీయుడు గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.ఈ క్రమంలో రఫాలోని యూరోపియన్ ఆసుపత్రికి ఐరాస సిబ్బంది వెళ్తుండగా ఈ దాడి జరిగింది.ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోగా.మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.మృతుడు ఐక్యరాజ్యసమితిలోని భద్రత, రక్షణ విభాగంలో పనిచేస్తున్నారు.ఆయన పేరు, ఇతర వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
కానీ సదరు వ్యక్తి గతంలో భారత సైన్యంలో పనిచేసినట్లుగా కథనాలు వస్తున్నాయి.ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం నేపథ్యంలో ఐరాస సిబ్బంది మరణించడం ఇదే తొలిసారి.

ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్( Antonio Guterres ) తీవ్ర విచారం వ్యక్తం చేశారు.యుద్దం కారణంగా సామాన్యులతో పాటు మానవతా సాయం అందజేస్తున్న సిబ్బంది సైతం ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో వెంటనే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని గుటెరస్ అన్నారు.దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగాలని.బందీలను హమాస్( Hamas ) సైతం విడిచిపెట్టాలని ఆయన సూచించారు.కాగా.ఈ నెల ప్రారంభంలోనూ గాజాలోకి మానవతా సాయం పంపడానికి వినియోగిస్తున్న కెరోమ్ షాలోమ్ క్రాసింగ్పై హమాస్ రాకెట్లతో దాడి చేయడం కలకలం రేపింది.
ఈ ఘటనలో ఏడుగురు ఇజ్రాయెల్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.గాజాకు మానవతా సాయం అడ్డుకునేందుకే హమాస్ ఈ దాడికి పాల్పడిందని ఇజ్రాయెల్ ఆరోపించగా.
తాము ఐడీఎఫ్ కార్యాలయంపైనే దాడి చేశామని హమాస్ చెబుతోంది.