ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏపీలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో టీడీపీ, జనసేన, బిజెపి కూటమి లు ఉన్నాయి.ముఖ్యంగా టిడిపికి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం కావడం, ఎన్నికల్లో గెలవకపోతే టిడిపి దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉండడంతో, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ( Chandrababu Naidu )తీవ్రంగానే విజయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే పొత్తులో భాగంగా టిడిపి, జనసేన లకు సీట్లు ఖరారు చేశారు .అభ్యర్థుల ప్రకటన చాలావరకు పూర్తి చేశారు .పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎన్నికల మూడ్ లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.దీనిలో భాగంగానే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.చంద్రబాబు సైతం రోడ్ షోలు , బహిరంగ సభలతో ఎన్నికల వరకు బిజీగా ఉండే విధంగా షెడ్యూల్ ను రూపొందించుకున్నారు.23న విజయవాడ( Vijayawada )లో టిడిపి ప్రత్యేకంగా వర్క్ షాప్ నిర్వహిస్తోంది.

ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో జరిగే ఈ కార్యక్రమానికి టిడిపి అధినేత చంద్రబాబు స్వయంగా హాజరవుతారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది .దీనికి ఈ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులతో పాటు, ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన కీలక నాయకులు, ఇప్పటికే నియమించుకున్న అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ , పొలిటికల్ మేనేజర్, మీడియా మేనేజర్, సోషల్ మీడియా మేనేజర్లను వర్క్ షాప్ కు పిలిచారు. రాబోయే రెండు నెలల్లో ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాల పైన ఈ వర్క్ షాప్ లో వారికి అవగాహన కల్పించనున్నారు.
టిడిపి లోక్ సభ అభ్యర్థులతో పాటు, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ జాబితాను నేడు లేదా రేపు ప్రకటించనున్నారు.

చంద్రబాబు ఈనెల 24, 25 తేదీల్లో కుప్పం నియోజకవర్గం( Kuppam Assembly constituency )లో పర్యటిస్తారు.26 నుంచి ప్రజాబలం పేరుతో చిత్తూరు లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల ప్రచార యాత్రను ప్రారంభించనున్నారు.రోజుకు ఒక నియోజకవర్గం చొప్పున చంద్రబాబు పర్యటించే విధంగా షెడ్యూల్ ను రూపొందించుకున్నారు.ప్రతి నియోజకవర్గంలోనూ పదివేల మందితో ప్రజాగణం సభను నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.







