రాజన్న సిరిసిల్ల జిల్లా :అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల చే ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వస్తువులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి( CS Shanti Kumari ) , రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అదనపు కలెక్టర్ పి.గౌతమి ( P Gouthami )తో కలిసి పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల నిర్వహణ బాధ్యతలను స్వశక్తి మహిళా సంఘాలకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని,ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి ప్రభుత్వ పాఠశాలకు *అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను సత్వరమే ఏర్పాటు చేయాలని సి.ఎస్ కలెక్టర్లను ఆదేశించారు.
*అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో మహిళా సంఘం నాయకురాలు అధ్యక్షురాలిగా, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మెంబర్ కన్వీనర్ గా ఉంటారని అన్నారు గ్రామంలో 2,3 మహిళా సంఘాలు ఉంటే పాఠశాలకు దగ్గరగా ఉన్న మహిళా సంఘానికి మొదటి సంవత్సరం అవకాశం కల్పించాలని, కమిటీ అధ్యక్షులు మెంబర్ కన్వీనర్ కలిసి పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లుల కమిటీ సభ్యులుగా ఎంపిక చేస్తారని, రెండు సంవత్సరాల పాటు పాఠశాల నిర్వహణ కమిటీ ఉంటుందని,అమ్మ పాఠశాల( Amma patashala ) నిర్వహణ కమిటీకి ప్రత్యేక బ్యాంక్ ఖాతా ప్రారంభించాలని సిఎస్ సూచించారు.ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల స్కూలు యూనిఫార్మలు కుట్టే బాధ్యతను సైతం స్వశక్తి మహిళా సంఘాలకు కేటాయించామని, జిల్లాలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా స్కూల్ యూనిఫాంలో కుట్టే సామర్థ్యం గల మహిళా సంఘాలను గుర్తించి వారికి వెంటనే ఆర్డర్ అందించాలని సి ఎస్ కలెక్టర్లకు సూచించారు.
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీటి సౌకర్యం, తరగతి గదుల మైనర్, మేజర్ మరమ్మత్తులు,నిరుపయోగంగా ఉన్న టాయిలెట్లను ఉపయోగంలోకి తీసుకురావడం, బాలికల కోసం అదనపు టాయిలెట్ల నిర్మాణం, తరగతి గదికి విద్యుత్ సౌకర్యం కల్పన వంటి మౌలిక వసతులు అమ్మ పాఠశాల కమిటీల ద్వారా జూన్ 10 వరకు కల్పించాలని సిఎస్ తెలిపారు.యూ.డి.ఐ.ఎస్.ఈ 2023 డేటా ప్రకారం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చేపట్టాల్సిన పనులను గుర్తించి కలెక్టర్లు వెంటనే పరిపాలన అనుమతులు మంజూరు చేసి జిల్లా సమాఖ్య కు అప్పగించాలని అన్నారు.
జిల్లాలో అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ అధికారులను మండలాల వారీగా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలుగా కలెక్టర్ నియమించాలని, సదరు ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన ప్రతిపాదనలను జిల్లా సమాఖ్య కు కలెక్టర్ కు సమర్పించాలని అన్నారు.అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల వద్ద 25 వేల రూపాయల వరకు ఎమర్జెన్సీ నిధులు వినియోగించవచ్చని, మిగిలిన పనులు జిల్లా సమాఖ్య కు కేటాయించాల్సి ఉంటుందని, డి ఎం ఎఫ్ టి, ప్రత్యేక అభివృద్ధి నిధులు, నరేగా నిధులను వినియోగించుకొని పాఠశాలలో మౌలిక వసతులు చేపట్టాలని అన్నారు.
పాఠశాలలో చేపట్టిన పనులకు లక్ష రూపాయల వరకు ఎంపీడీవో పరిశీలించి బిల్లులు చెల్లిస్తారని, లక్షకు పైగా పనులకు ఎం బుక్ లను పరిశీలించే జిల్లా కలెక్టర్ చెలింపులు చేస్తారని, అవసరమైన నిధులు కలెక్టర్ వద్ద అందుబాటులో ఉంచుతామని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ , జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి , ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి , ఈ డి.ఎస్సీ కార్పొరేషన్ డా వినోద్ కుమార్, ఏ డి.మైన్స్ రఘుబాబు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.