తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు( Telangana Assembly Elections ) చేదు ఫలితాన్ని ఇచ్చినా.రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని బిజెపి భావిస్తోంది.
దానికి అనుగుణంగా తెలంగాణ బిజెపి( BJP ) నేతల్లో ఉత్సాహం పెంచే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘోరంగా ఓటమి చెందడానికి నాయకులు మధ్య సమన్వయ లోపం, గ్రూపు రాజకీయాలే కారణమని ఆ పార్టీ పెద్దలకు అర్థమైంది.
అయితే నాయకులు సమన్వయంతో ఎన్నికలకు సిద్ధం కాకపోతే, మళ్లీ లోక్ సభ ఎన్నికల్లోనూ నిరాశ తప్పదనే భయము బిజెపి అగ్ర నేతల్లో ఉంది.అందుకే లోక్ సభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలనే వ్యూహంతో ఉంది.
దీనిలో భాగంగానే రాబోయే పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.దీనిలో భాగంగా చేరికల కమిటీని మళ్లీ యాక్టివ్ చేయాలని నిర్ణయించుకుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేరికల కమిటీకి చైర్మన్ గా ఈటెల రాజేందర్ ( Etela Rajender )ఉన్నారు.

అయితే ఈసారి కొత్తగా కమిటీని ఏర్పాటు చేయాలని రాజేందర్ తో పాటు, బండి సంజయ్( Bandi Sanjay ) ను కూడా కమిటీలో నియమించాలని, సంజయ్, రాజేందర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.దీని ద్వారా సంజయ్.రాజేందర్ మధ్య ఉన్న గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టవచ్చని బిజెపి అధిష్టానం అంచనా వేస్తోంది.
ఇక బిజెపిలో కొన్ని పార్లమెంట్ స్థానాలకు పోటీ తీవ్రంగా ఉంది.ముఖ్యంగా మల్కాజ్ గిరి, జహీరాబాద్, మెదక్, హైదరాబాద్ ఎంపీ టికెట్ల కోసం పార్టీకి చెందిన సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు.

ఆ టికెట్లను దక్కించుకునేందుకు ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు బిజెపిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.దీంతో ఇతర పార్టీల్లోని కీలక నేతల్ని చేర్చుకోవడమే లక్ష్యంగా బండి సంజయ్, ఈటెల రాజేందర్ ల నేతృత్వంలో చేరికల కమిటీని ఏర్పాటు చేసే ప్లాన్ లో బిజెపి అధిష్టానం ఉన్నట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.







