యాదాద్రి భువనగిరి జిల్లా: పోలీసులు ల్యాండ్ సెటిల్మెంట్లు చేయొద్దని రాచకొండ సీపీ సుధీర్ బాబు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని నేరెడ్మెట్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో జాయింట్ సీపీ తరుణ్ జోషితో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లడుతూ భూ వివాదాల్లో పోలీసులు అనవసరంగా తల దూరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.ఎసీపి(చట్ట పరమైన నిర్ధారిత ప్రక్రియ) ప్రకారం భూ ఫిర్యాదుల్లో పని చేయాలన్నారు.
నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేసే అంతరాష్ట్ర నేరస్థులను వెంటాడి పట్టుకోవాలని ఆదేశించారు.
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డ్రగ్స్,ఇతర మత్తు పదార్థాలపై నిఘా పెట్టి స్మగ్లర్లను పట్టుకోవాలని సూచించారు.
ప్రతి క్రైమ్ లో నిందితులకు శిక్ష పడేలా దర్యాప్తు,విచారణ జరపాలన్నారు.ప్రతి రోజు పోలీసు అధికారులు ఫీల్డ్ లో ఉంటూ ప్రజలతో కలిసి వారి సమస్యలు తెలుసుకోవాలని, నేరస్థులపై నిఘా పెంచి క్రైమ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఆపదలో ఉన్నవారికి పోలీసు సేవలు అతి తక్కువ సమయంలో అందేలా కృషి చేయాలన్నారు.మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ను మరింత బలోపేతం చేస్తామని వివరించారు.
ఈ సమావేశంలో డీసీపీ, అదనపు డీసీపీలు, ఏసీపీలు,ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.