రిలయన్స్ ఇండస్ట్రీస్( Reliance Industries ) నుంచి పూర్తిగా వేరుపడి ఇపుడు నూతనంగా ఏర్పాటైన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇకనుండి పూర్తి స్థాయి ఆర్థిక సేవల సంస్థగా అవతరించేందుకు రెడీ అవుతోంది.ఇప్పటికే టెలికాం, రిటైల్ మార్కెట్లో తనదైన ముద్ర వేసుకున్న రిలయన్స్.
ఇప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్లోనూ తన సత్తా చాటాలని చూస్తోంది.ఇందులో భాగంగా జేఎఫ్ఎస్ ( JFS )త్వరలో ఆటో, హోమ్లోన్లను కూడా జారీ చేయనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఆగస్టులో మార్కెట్లో లిస్టయిన ఈ సంస్థ.సోమవారం తన తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

ఈ సందర్భంగా అనలిస్టులకు సంస్థ ఓ ప్రజంటేషన్ ఇచ్చింది.ఇప్పటికే ముంబైలోని వేతన జీవులుకు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్( Jio Financial Services ) ద్వారా వ్యక్తిగత రుణాలను జారీ చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది.ఈ నేపధ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న 300 స్టోర్లలో గృహ వినియోగ వస్తువులపై రుణాలను మంజూరు చేస్తోంది.త్వరలో వ్యాపారులకు సైతం రుణాలు జారీ చేస్తామని కంపెనీ ప్రకటించింది.
జేఎఫ్ఎస్ బ్రోకరేజీ విభాగం ఇప్పటికే 24 బీమా సంస్థలతో జట్టుకట్టింది.పేమెంట్ విభాగం సేవింగ్స్ అకౌంట్లను, బిల్ పేమెంట్ సర్వీసులను రీలాంచ్ చేసింది.

అదేవిధంగా పనిలో పనిగా త్వరలో డెబిట్ కార్డులు కూడా తీసుకురావాలన్న యోచన చేస్తున్నట్టు కనబడుతోంది.అవును, తన ఉత్పత్తులను వినియోగదారులకు చేరువ చేసేందుకు ఓ యాప్ను సైతం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సిద్ధం చేస్తోంది.మరోవైపు సోమవారం వెలువడిన సెప్టెంబరు త్రైమాసిక ఫలితాల్లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ.668.18 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేయడం కొసమెరుపు.ఇదే సమయంలో ఆదాయం కూడా రూ.414.13 కోట్ల నుంచి 47 శాతం పెరిగి రూ.608.04 కోట్లకు చేరింది.సంస్థ గ్రూప్ టెక్నాలజీ అధికారిగా ఎ.ఆర్.గణేశ్ను నియమించారు.ఇప్పటి వరకు ఆయన ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అధికారిగా ఉన్నారు.







