ఒక యువకుడు తనకు వరుసకు కూతురయ్యే యువతిని ప్రేమించి అనైతిక సంబంధం పెట్టుకున్నాడు.ఆ యువతి తండ్రి ఎన్నిసార్లు చెప్పినా యువకుడిలో మార్పు రాకపోవడంతో నలుగురు వ్యక్తుల సహాయంతో ఆ యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు.
ఈ హత్య తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా లో గత నెల 15న చోటుచేసుకుంది.పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేయగా తాజాగా నిందితులు పోలీసుల చేతికి చిక్కడంతో హత్య ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.
బీహార్ కు చెందిన కరణ్ కుమార్( Karan Kumar ) (18) అనే వ్యక్తి హైదరాబాద్ వచ్చి రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిర్దవెల్లి లోని ఓ కోళ్ల ఫారం లో కూలి పనులు చేస్తుండేవాడు. రంజిత్ కుమార్ అనే వ్యక్తి కుటుంబం కూడా బీహార్ నుంచి నిర్దవెల్లి వలస వచ్చి స్థానిక కోళ్ల ఫారం లో కూలీ పనులు చేసుకుంటున్నారు.
కరణ్ కుమార్, రంజిత్ కుమార్ వరుసకు సోదరులు.అయితే రంజిత్ కుమార్ కూతురిని కరణ్ కుమార్ ప్రేమించి అనైతిక సంబంధం పెట్టుకున్నాడు.
ఈ విషయం రంజిత్ కుమార్( Ranjith Kumar ) కు తెలియడంతో.తన కూతురు వరుసకు కుమార్తె అవుతుందని ఇలా చేయడం మంచి పద్ధతి కాదని కరణ్ కుమార్ ను పలుసార్లు హెచ్చరించాడు.కానీ కరణ్ కుమార్ తన పద్ధతిని మార్చుకోలేదు.ఆ యువతి తో తనకు వివాహం అయిందని సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇష్టానుసారంగా ప్రచారం చేశాడు.కరణ్ ఆగడాలతో విసిగిపోయిన రంజిత్ కుమార్, కరణ్ ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.బీహార్ కు చెందిన బబ్లూ, ముంతోష్ కుమార్ ( Bablu, Muntosh Kumar )లతోపాటు మరో ఇద్దరు మైనర్ల సహాయం తీసుకుని పథకం ప్రకారం ఆగస్టు 15న కరణ్ కు ఫోన్ చేసి పిలిపించి నిర్దవెల్లి- జూలపల్లి మధ్య రహదారిలో పక్కనే ఉన్న బురద నీటిలో ముంచి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి అక్కడే పాతిపెట్టారు.
కరణ్ కనిపించకపోవడంతో అతని అన్న దీపక్ ఆగస్టు 29న కేశంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.కరణ్ కు చివరిసారిగా రంజిత్ కాల్ చేయడం, ఆ కాల్ సిగ్నల్ నిర్దవెల్లి వద్ద ఉన్నట్లు గుర్తించారు.అయితే రంజిత్ పరారీలో ఉండడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల నిందితులను పట్టుకోవడం కష్టమైంది.నిందితుల్లో ఒకరు ఆ యువతికి కాల్ చేసి స్విచ్ ఆఫ్ చేశారు.
దీంతో ప్రకాశం జిల్లా అద్దంకిలో నిందితులు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ముగ్గురు నిందితులను రిమాండ్ కు, ఇద్దరు మైనర్లను జువైనల్ హోంకు తరలించారు.