తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్( BRS party ) లో నాయకుల మధ్య లుకలుకలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతుండగా, ఆ పార్టీలో అసమ్మతి స్వరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
తాజాగా కెసిఆర్ మేనల్లుడు , మంత్రి హరీష్ రావు పై సీనియర్ నేత మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ( Mainampally hanumanth Rao )సంచలన ఆరోపణలు చేయడం పార్టీలో కలకలం రేపుతోంది.తాజాగా మీడియాతో మాట్లాడిన మైనంపల్లి మెదక్ లో ప్రచారం చేయడానికి హరీష్ రావు ఎవరు అంటూ ఫైర్ అయ్యారు.
ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా మల్కాజ్ గిరి నుంచే తాను పోటీ చేస్తానని , మెదక్ నుంచి తన కుమారుడు రోహిత్ పోటీ చేస్తాడని మైనంపల్లి ప్రకటించారు .ప్రస్తుతం తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని , తనకు ఎప్పుడో టిక్కెట్ ఖరారు అయిందని , మధ్యలో హరీష్ రావు కలుగజేసుకుని పెత్తనం చేయడం ఏమిటని మైనంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవసరమైతే తన సత్తా ఏంటో హరీష్ కు చూపిస్తానని హరీష్ రావు( Hareesh Rao ) ను ఆయన నియోజకవర్గంలోనే ఓడించేందుకు కూడా తాను వెనకాడబోనంటూ మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.హరీష్ రావు తన గతం ఏమిటో గుర్తించుకోవాలని, తన నియోజకవర్గం వదిలి మెదక్ జిల్లాలో పెత్తనం చేస్తున్నాడని , హరీష్ రావు బట్టలు ఊడదీసే వరకు నిద్రపోనని మండిపడ్డారు.అక్రమంగా లక్ష కోట్లు సంపాదించాడని , రాజకీయంగా ఎంతో మందిని అణిచివేశాడని, హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని మైనంపల్లి సవాల్ చేశారు.

మెదక్ లో తన తనయుడిని కచ్చితంగా గెలిపించుకుంటానని సవాల్ చేశారు.అయితే మైనంపల్లి ఈ స్థాయిలో ఫైర్ అవ్వడానికి కారణం ఉంది .మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్ మెదక్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు .ఈ నియోజకవర్గంలో టికెట్ తనకే వస్తుందని ఆశతో ఉన్నారు.అయితే చివరి నిమిషంలో మెదక్ స్థానం నుంచి పద్మ దేవేందర్ రెడ్డి పేరు ఖరారు అయినట్లుగా వార్తలు వస్తుండడంతో, దీనంతటికి కారణం హరీష్ రావు అని అనుమానిస్తున్న మైనంపల్లి ఈ స్థాయిలో బహిరంగంగా విమర్శలు చేయడం సంచలనంగా మారింది.







