గతంతో పోలిస్తే బాగా బలపడ్డామనే అభిప్రాయం తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.మొన్నటి వరకు అంతర్గత విభేదాలతో పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వంటివన్నీ బిజెపి అనుకూలంగా మార్చుకుని, బీఆర్ఎస్ కు తామే ప్రధాన పోటీదారు అన్నట్లుగా వ్యవహరించింది.
అయితే అక్కడ ఆ పార్టీలోనూ గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం , నాయకులు మధ్య సమన్వయం లేకపోవడం వంటివన్నీ కాంగ్రెస్ కు కలిసి వచ్చాయి.దీనికి తోడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో( Karnataka Elections ) కాంగ్రెస్ విజయం సాధించడంతో, తెలంగాణ కాంగ్రెస్ పైన ఆ ప్రభావం కనిపిస్తోంది.
అలాగే ఇటీవల కాలంలో కాంగ్రెస్ లోకి చేరికలు జోరందుకోవడం, ఇతర పార్టీలలోని కీలక నేతలు అంతా కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండడం వంటివన్నీ కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి.

తెలంగాణ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.త్వరలో జరగబోయే తెలంగాణ ఎన్నికల్లో కర్ణాటకలో అమలు చేసిన వ్యూహాలను కొనసాగించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.ముఖ్యంగా బూత్ ,ఎలక్షన్ మేనేజ్ మెంట్ వంటి వ్యూహాలతో ముందుకు వెళ్లేలా కార్యాచరణను రూపొందిస్తున్నారు.
నిన్న గాంధీభవన్ లోని ఇందిరా భవన్ లో లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ లో భాగంగా బూత్ లెవెల్ మేనేజ్మెంట్ కార్యక్రమం జరిగింది.దీనికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) తో పాటు, ఆ పార్టీ కీలక నేతలైన కొప్పుల రాజు, విష్ణునాథ్, సంపత్ కుమార్, శశికాంత్ సింతల్ , మహేష్ కుమార్ గౌడ్ , డిసిసి అధ్యక్షులు హాజరయ్యారు.”

ఎన్నికలకు నాలుగైదు నెలలే ఉన్నందున పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలి.కర్ణాటకలో అనుసరించినట్లుగానే బూత్ లెవెల్ ఏజెంట్లను ప్రతి మండలానికి ఐదుగురు సమన్వయకర్తలను, వారిపై ప్రతి జిల్లాకు ఐదుగురు సమన్వయకర్తలను నియమించాలి.ఎన్నికల కమిషన్ సమావేశాలకు వీరిని పిలవాలని కలెక్టర్లకు లేఖలు అందజేయాలి.ప్రతి బిఎల్ఎ తన పరిధిలోని సహాయకులతో ఇంటింటికీ తిరిగి ఓటర్ల జాబితాను పరిశీలించాలి.ఫిర్యాదులను ఆధారాలతో ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులకు అందజేయాలి.ఇందిరా భవన్ లోని ఒక అంతస్తులో ఐటీ కార్యాలయం ఏర్పాటు చేయాలి ” అనే నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకున్నారు.







