సూర్యాపేట జిల్లా: తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఐఎఫ్టియు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కామళ్ళ నవీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మునగాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ హాస్టల్ వర్కర్లు హాస్టల్ ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 మోడల్ స్కూల్ హాస్టల్లో పని చేస్తున్న సిబ్బందికి నేటికీ కూడా ఉద్యోగ భద్రత లేదన్నారు.దీనికి తోడు అధిక పని భారం కొనసాగుతుందని, సకాలంలో సిబ్బందికి వేతనాలు రాక పెరుగుతున్న నిత్యవసర సరుకులకు ధరలకు అనుగుణంగా జీతాలు పెంచకపోవడం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేజీబీవీలో పని చేస్తున్న సిబ్బందికి ఇస్తున్న మాదిరిగా జీతాలను మోడల్ స్కూల్ హాస్టల్ లో పనిచేస్తున్న వారికి కూడా అమలు చేయాలన్నారు.పనికి తగ్గ వేతనం,వీక్లీ ఆఫ్ అమలు చేయాలని, అదేవిధంగా క్రమం తప్పకుండా ప్రతి నెల సిబ్బంది బ్యాంకు ఖాతాలోకి జీతాన్ని జమ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి, మంత్రులు,ఎమ్మెల్యేలు లక్షల జీతాలు తీసుకుంటూ వాళ్ల కుటుంబాలకు ఎలాంటి ఢోకా లేకుండా చూసుకుంటున్నారని,
మోడల్ స్కూల్ హాస్టల్ లో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించి,కనీస వేతన చట్టం సవరించి కనీస వేతనం రూ.27 వేలు ఇవ్వడంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.ఇప్పటికైనా మోడల్ స్కూల్ హాస్టల్ సిబ్బంది సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి,నాగరాణి,వై.అలివేణి,దాసరి చిన్ని,ఎల్.సంపూర్ణ,ఎల్.ఈశ్వరి,కోట సుజాత,కామళ్ల సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.