ఉమ్మడి ఖమ్మం జిల్లా నిరుద్యోగులకు మాజీ ఎంపీ పొంగులేటి( Former MP Ponguleti ) హామీ నిరుద్యోగ యువతీ, యువకుల మోముల్లో చిరునవ్వు చూడలనేదే నా ప్రధాన లక్ష్యం, ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని ప్రతి ఒక్క నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది,ఇందు కోసం ప్రతి ఏడాది ఉమ్మడి ఖమ్మంజిల్లాలో నాకు పదవి ఉన్న లేకున్నా జాబ్ మేళాలను నిర్వహిస్తా, ఇది నా హామీ అని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.120కి పైగా కంపెనీల ద్వారా 10వేల కు పైగా ఉద్యోగాలను నిరుద్యోగులకు ఇప్పించేందుకు ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్ లో సోమవారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.ఈ జాబ్ మేళాకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో మాట్లాడారు.ఆ వివరాలు పొంగులేటి మాటల్లోనే,పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో తీవ్రమైన సమస్యలు పేరుకు పోయాయి.
అన్ని వర్గాల వారిని సీఎం కేసీఆర్ తన మాటలతో మభ్యపెట్టారు.ప్రధానంగా ఇంటికి ఓ ఉద్యోగం ఇస్తానని మోసం చేశారు.
ఎన్నికల ముందు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేస్తున్నారు.ఇది ఎంత వరకు సమంజసం…? రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగ ఖాళీలు ఉంటే నామ మాత్రపు ఖాళీలను భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్సీ ఉద్యోగాల నోటిఫికేషన్ వేశారు.మళ్లీ అందులోనూ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న తరుపు వారికి ఉద్యోగాలను ఇప్పించేందుకు పేపరును లీకేజీ ని చేయించారు.మూడు నెలలు గడుస్తున్నా నిందితులపై ఇంతవరకు చర్యలు లేవు.
సిట్టింగ్ జడ్జి చే లేదా సీబీఐ చే విచారణ జరిపించాలని గతంలోనూ డిమాండ్ చేశాం… ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాం.తినితినక కష్టాలు పడుతూ తల్లిదండ్రులు వారి పిల్లలను చదివిస్తే వారి ప్రతిభకనుగుణంగా ఉద్యోగాలను కేటాయించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి పేపర్ లీకేజీ చేయించడం దురదృష్టకరం.
టీఎస్పీఎస్సీ పరీక్ష రాసిన ప్రతి ఒక్క నిరుద్యోగ యువత అకౌంట్లో లక్ష రూపాయాలను ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి నెలకు రూ.3వేలు ఇవ్వాలి.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాకుండా వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నింటిని భర్తీ చేసేందుకు కావాల్సిన నోటిఫికేషన్లు వేసి నిరుద్యోగుల పట్ల మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి.
ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని నిరుద్యోగ సోదరసోదరీమణులందరి ఆశలను, ఆశయాలను నెరవేర్చేందుకు నేను పూనుకున్నాను.వీలైనంత త్వరలో ప్రతి ఒక్కరి ఆశయాలను నెరువేరుస్తానని హామీ ఇస్తున్నాను.ఈ మెగా జాబ్ మేళాలో 21వేల మందికి పైగా అభ్యర్థులు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు.సుమారు 15వేల మందికి పైగా అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకానున్నారు.
హాజరైన ప్రతి ఒక్క అభ్యర్థికి ఎంత సమయమైనా ఇంటర్వ్యూ నిర్వహించి వారి అర్హత, ప్రతిభ ఆధారంగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇప్పిస్తాం.రూ.15వేలు మొదలుకొని రూ.65వేల వరకు నెలసరి వేతనాలు చెల్లించే కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి.చెవిటి, మూగ, వికలాంగులు, ట్రాన్స్ జెండర్లు మొదలగు వారికి ప్రత్యేక ప్యాకేజీలతో జాబ్ లు ఇప్పించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరిగింది.ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
అనంతరం ఇంటర్వ్యూలో ప్రతిభ కనబర్చి ఉద్యోగం సాధించిన వారికి పొంగులేటి అపాయింట్ మెంట్ ఆర్డర్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, వూకంటి గోపాలరావు, జారె ఆదినారాయణ, డాక్టర్ కోటా రాంబాబు, విజయబాయి, వైరా మున్సిపల్ చైర్మన్ సూతగాని జైపాల్, కార్పొరేటర్లు దొడ్డా నగేష్, మలీదు జగన్, మియాభాయ్, నారపోగు వెంకట్, రైట్ ఛాయిస్ మెండెం కిరణ్ కుమార్, కొత్త కోటేశ్వరరావు, జాబ్ మేళా కన్సల్టెన్సీల నిర్వాహకుడు మన్ మోహన్ తదితరులు ఉన్నారు
.







