పొత్తులు సీఎం సీటు విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )చేసిన ప్రసంగంపైనే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.సీఎం సీటు కావాలనుకుంటే వచ్చేది కాదని, సమయం వచ్చినప్పుడు అదే వస్తుంది అంటూ ఆ కుర్చీపై తనకు ఆశ లేదు అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.
అదే సమయంలో వైసీపీని ఓడించేందుకు, ఎవరితోనైనా కలిసేందుకు సిద్ధమని ప్రకటించారు.టిడిపి, జనసేన, బిజెపి కలిసి పోటీ చేస్తాయని, ఈ మేరకు వారు ఒప్పుకోకపోయినా వారిని ఒప్పించే బాధ్యత తాను తీసుకుంటానంటూ పవన్ ప్రకటన చేశారు.
ఈ ప్రకటనపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.జనసేనలోనూ పవన్ ప్రకటనపై ఒక రకమైన అసంతృప్తి నెలకొన్నా, అధినేత నిర్ణయమే ఫైనల్ కావడంతో జనసైనికులు సైతం పవన్ నిర్ణయానికి మద్దతు తెలపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక సీఎం సీటు విషయంలో తమకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పవన్ ప్రకటన చేయడం తమకు కలిసి వచ్చిందనే లెక్కల్లో టిడిపి అధినేత చంద్రబాబు ఉన్నారు.టిడిపి, జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచినా, సీఎం కుర్చీ విషయంలో తనుకు ఏ ఇబ్బందులు ఉండవని బాబు ఆనంద పడుతుండగా, టిడిపి నియోజకవర్గస్థాయి నేతల్లో మాత్రం ఈ పొత్తులపై టెన్షన్ నెలకొంది.

ఇప్పటికే చాలా నియోజకవర్గాలకు టిడిపి అభ్యర్థులను చంద్రబాబు( Chandrababu Naidu ) ప్రకటించారు.ఇంకా అనేక స్థానాల్లో నియోజకవర్గ సమన్వయకర్తలను నియమించారు.రాబోయే ఎన్నికల్లో సీటు గ్యారంటీ అని చెప్పడంతో భారీగా సొమ్ములు ఖర్చు పెట్టుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అయితే ఇప్పుడు జనసేనతో పొత్తు కుదరబోతుండడం, కేవలం కొద్ది సీట్లు మాత్రమే జనసేనకు( Jana sena ) కేటాయించే అవకాశం ఉందని ముందుగా అంచనా వేసినా పవన్ మాత్రం టిడిపి అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాలే పొత్తులో భాగంగా కోరుతుండడంతో జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లోని టిడిపి నేతల్లో ఆందోళన నెలకొంది.

పొత్తులో భాగంగా 40 నుంచి 50 సీట్లకు పైగా పవన్ డిమాండ్ చేస్తున్నారనే సమాచారంతో ఆ పార్టీకి గట్టి పట్టున్న ఉత్తరాంధ్ర ఉమ్మడి గోదావరి జిల్లాలోని టిడిపి నేతలకు ఆందోళన పెరుగుతుంది.పొత్తులో భాగంగా తమ నియోజకవర్గాలను జనసేనకు టీడీపీ అధినేత చంద్రబాబు కేటాయిస్తే తమ పరిస్థితి ఏమిటి అనే టెన్షన్ పడుతున్నారు.గతంతో పోలిస్తే జనసేన ఓటు బ్యాంకు రెట్టింపు అయిందంటూ పవన్ ప్రసంగాలు చేస్తూ, ఆ స్థాయిలోనే సీట్లు కేటాయింపు జరగాలని పవన్ టిడిపి పై ఒత్తిడి చేస్తున్నారట.సీఎం సీటు విషయంలో తాను ఎటువంటి పేఛీ పెట్టడం లేదు కాబట్టి, తాము కోరినన్ని సీట్లు కేటాయించాల్సిందే అని డిమాండ్ ను పవన్ బలంగా వినిపిస్తే, తమ సీట్లకు ఎసరు వస్తుందని టిడిపి పోటీ చేయాలని చూస్తున్న నాయకుల్లో ఆందోళన మొదలయ్యిందట.







